- నిజాయితీ ఉంటే.. న్యాయ విచారణకు లేఖ రాయాలి: కిషన్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చే ఆలోచన బీజేపీకి లేదని వెల్లడి
నలుగురు ఆర్టిస్టులతో వీడియో రికార్డ్
నలుగురు ఆర్టిస్టులతో వీడియో రికార్డ్ చేసి.. లొల్లి చేస్తే నమ్మేందుకు తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని కిషన్రెడ్డి అన్నారు. ప్రెస్ మీట్ లో కేసీఆర్ చెప్పింది చూస్తుంటే, కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. ఎవరో ఒకరు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫొటో దిగినంత మాత్రానా.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో హోంమంత్రికి సంబంధం ఉందనడం అర్థరహితమన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదన్నారు. తెలంగాణ ప్రజల, అమరుల ఆకాంక్షాలను పూర్తిచేయాలన్న సంకల్పంతో వచ్చే వారిని పార్టీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. చేరికల కోసం రాష్ట్ర బీజేపీలో ఒక కమిటీ ఉందన్నారు. తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పార్టీలోకి తీసుకోవాలనే విషయంలో తాము స్పష్టంగా ఉన్నామన్నారు.
ఎన్టీఆర్ పై చెప్పులేయించారు
ఎన్టీఆర్ పై వైస్రాయ్ హోటల్ లో చెప్పులేయించిన వ్యక్తి (కేసీఆర్), ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని కిషన్ రెడ్డి అన్నారు. కల్వకుంట్ల కుటుంబ పాలనతో తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఫైర్ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.