
హైదరాబాద్, వెలుగు: కేంద్రంలో ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వంలో మనం కూడా భాగస్వాములుగా ఉంటాం అని కేటీఆర్ కామెంట్పై బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ మాట్లాడిన వీడియోను కిషన్ రెడ్డి మంగళవారం షేర్ చేశారు.‘ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల బలమైన బంధం బట్టబయలైంది. కల్వకుంట్ల కుటుంబ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల బంధంపై స్పష్టతనిచ్చాడు. ఇక తేల్చుకోవాల్సింది తెలంగాణ ప్రజలే’ అంటూ కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని బంగారు కుటుంబ సభ్యుడు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ భాయ్ భాయ్ అనేందుకు కేటీఆర్ మాటలే సాక్ష్యం అంటూ కిషన్ రెడ్డి ట్వీట్లో పేర్కొన్నారు.