
- ల్యాండ్, శాండ్, లిక్కర్, రైస్, మైన్స్ మాఫియాలను నడిపిస్తున్నరు: కిషన్రెడ్డి
- మేము పవర్లోకి రాగానే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేస్తం
- సాయిగణేశ్ ఆత్మహత్యకు కారకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: మాఫియాగా టీఆర్ఎస్ లీడర్లు
ప్రజల ఆత్మగౌరవాన్ని దిగజార్చారు
గవర్నర్ తమిళిసైపై సీఎం, మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలకు దిగి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దిగజార్చారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. గవర్నర్కు ప్రొటోకాల్ ఇవ్వకపోవడం బాధాకరమని, మహిళా గవర్నర్ను రెచ్చగొట్టేలా విమర్శలు చేయడం, బడ్జెట్ సమావేశాల్లో ఆమె ప్రసంగం లేకపోవడం అప్రజాస్వామికమని అన్నారు. ఇంత దిగజారుడు వ్యవహారం ఏ సీఎం చేయలేదని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనఅవసరం లేదని, అది రావాలని తాము కోరుకోవడం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దీని కోసం ఎలాంటి సిఫారసు చేయబోమని, అలాంటివి గవర్నర్ పరిధిలోనివని చెప్పారు. ధాన్యం సేకరణలో దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణకు మాత్రమే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఒప్పందం ప్రకారం కేంద్రం కొనుగోలు చేస్తుందన్నారు.
దమ్ముంటే మోడీ అవినీతి చిట్టా బయటపెట్టాలె
కేంద్రం, ప్రధాని మోడీపై టీఆర్ఎస్ నాయకులు గాలిమాటలు మాట్లాడొద్దని, కేసీఆర్ ఫ్యామిలీకి దమ్ముంటే ప్రధాని మోడీ అవినీతి చిట్టాను ప్రజల ముందుంచాలని కిషన్రెడ్డి సూచించారు. తాము అడ్డుకుని ఉంటే.. కేసీఆర్ కుటుంబం ఢిల్లీలో ధర్నా చేయగలిగేదా? అని ప్రశ్నించారు. దేశంలోనే అత్యధిక పెట్రోల్, డీజిల్ ధరలు తెలంగాణలో ఉన్నాయని, దీనికి ఏం సమాధానం చెప్తారని నిలదీశారు. మెడ మీద కత్తిపెట్టి ఒప్పందం చేసుకునే సంప్రదాయం కేసీఆర్ కుటుంబానిదేనన్నారు. ప్రధాని మోడీపై కేసీఆర్, మంత్రులు విష ప్రచారం చేయటంపై ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. దేశంలో ప్రళయాలు సృష్టిస్తానన్న కేసీఆర్.. ముందు టీఆర్ఎస్ పార్టీలో ప్రళయాలు, భూకంపాలు రాకుండా చూసుకోవాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ మాదిరిగా డైనింగ్ టేబుల్ పై కేంద్రం నిర్ణయాలు తీసుకోదని స్పష్టం చేశారు.
బస్తీ దవాఖాన్లలో పైసలు ఎవరివి హరీశ్?
రాష్ట్రానికి కేంద్రం పైసా ఇవ్వడం లేదని మంత్రి హరీశ్ రావు విమర్శలు చేస్తున్నారని, ఆయన ప్రారంభోత్సవాలు చేసే బస్తీ దవాఖాన్లకు పైసలు ఎవరిచ్చారో చెప్పాలని కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. గజ్వేల్ కు ఎన్ని నిధులిచ్చారో, దుబ్బాకకు ఎన్ని ఇచ్చారో లెక్కలు తీద్దామా? అని సవాల్ విసిరారు. కేంద్రం నిధులను ప్రధాని మోడీ ఏమైనా ఫాంహౌస్లో పెట్టుకుంటున్నారా? అని నిలదీశారు. ఇతర రాష్ట్రాలను కోరినట్లుగానే.. మన రాష్ట్రంలో కూడా ప్రతి ప్రాజెక్టు ఏర్పాటు కోసం కేంద్రం లేఖలు రాసిందని, కానీ వాటికి సీఎం కేసీఆర్ స్పందించడం లేదని ఆరోపించారు. పైగా కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. అభివృద్ధిపై చర్చించేందుకు పిలిస్తే సమావేశాలకు రాని కేసీఆర్కు కేంద్రాన్ని విమర్శించే హక్కు లేదన్నారు. ఈ నెల 29న హైదరాబాద్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వస్తున్నారని, రూ.పది వేల కోట్ల రూపాయలతో చేపట్టనున్న రోడ్ల అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని కిషన్ రెడ్డి చెప్పారు.