దేశంలో సీఏఏ అమలవుతోందని, ఇది మోదీ గ్యారంటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఈ చట్టం ఏ మతానికి, వర్గానికి వ్యతిరేకం కాదన్నారు. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోదీ ఉన్నారని, మరి కాంగ్రెస్ లో పీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని ఎంపీ బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు తోడుదొంగలని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు.
రాష్ట్రంలో ప్రజలను మోసం చేసి బొటాబొటి మెజారిటీతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. సమావేశంలో పార్టీ నేతలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాధవీలత, రాములు, బీబీ పాటిల్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జితేందర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, ఈటల రాజేందర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, రాకేశ్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, దుగ్యాల ప్రదీప్ రావు, ఏవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలో 400 సీట్లు.. రాష్ట్రంలో 12 సీట్లు టార్గెట్: అమిత్ షా
హైదరాబాద్, వెలుగు: మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తంచేశారు. తాను దేశంలోని చాలా రాష్ట్రాలకు వెళ్లానని, ఎక్కడికెళ్లినా మోదీనే ప్రధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ సారి బీజేపీ కచ్చితంగా 400 సీట్లు గెలుస్తుందని, అందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 12కు పైగా సీట్లలో బీజేపీని గెలిపించాలని సూచించారు. 75 ఏండ్లు అవుతున్నా రాష్ట్రంలో నిజాం పాలన ఆనవాళ్లు ఇంకా ఉన్నాయని, దాని నుంచి విముక్తి కలగాలంటే బీజేపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్పార్టీలు మజ్లిస్తో అంటకాగుతున్నాయని తెలిపారు. ఆ రెండు పార్టీలు మజ్లిస్ ఎజెండాతోనే పనిచేస్తాయని ఆరోపించారు.