బనకచర్లపై కేంద్రం నిర్ణయం తీసుకోలే: కిషన్ రెడ్డి

బనకచర్లపై కేంద్రం నిర్ణయం తీసుకోలే: కిషన్ రెడ్డి
  • గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగొద్దు: కిషన్​రెడ్డి
  • దీనిపై కేంద్రానికి రేవంత్ రెడ్డి లేఖ రాయాలి
  • జీబీ లింక్​ ప్రాజెక్టును ఎందుకు ఆపాలనేది జలవనరుల శాఖను కలిసి వివరించాలి
  • ప్రాజెక్టు రిపోర్టు చదివాక కేంద్రం నిర్ణయం
  • అప్పటి ఫైనాన్స్ మినిస్టర్​గానే విచారణకు ఈటల 
  • త్వరలో బీజేపీ తరఫున కమిషన్​ను కలుస్తామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు:  బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గోదావరి జలాల పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరగకుండా చూడాలని, ఈ విషయంలో కేంద్రానికి సీఎం రేవంత్ రెడ్డి వివరణాత్మక లేఖ రాయాలని సూచించారు. శనివారం హైదరాబాద్​లోని బీజేపీ స్టేట్ఆఫీసులో కిషన్​రెడ్డి మీడియాతో చిట్ చాట్  చేశారు. బనకచర్ల ప్రాజెక్ట్‌‌ తో తెలంగాణకు ఎలాంటి నష్టం జరుగుతుందో పూర్తి వివరాలతో జలవనరుల శాఖను సంప్రదించాలని తెలంగాణ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. 

వారంక్రితం ఏపీ సర్కారు బనకచర్ల ప్రాజెక్ట్‌‌కు సంబంధించి డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సమర్పించినప్పటికీ, కేంద్రం ఇంకా దాన్ని పరిశీలించలేదని తెలిపారు. ఆ రిపోర్ట్ అధ్యయనం తర్వాతే నిర్ణయమని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ విషయంలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని తెలిపారు. 

ఈటల..బీజేపీ నేతగా కమిషన్​ ముందుకు వెళ్లలే 

కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీకి బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నదని కిషన్ రెడ్డి  తెలిపారు. అప్పులు తేవడానికే గత ప్రభుత్వం కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకొచ్చింది తప్ప ప్రజలకు ఏదో చేద్దామని కాదన్నారు. కమిషన్ ముందు హాజరైన ఈటల రాజేందర్.. అప్పటి ఆర్థిక మంత్రిగా ఆయనకు తెలిసింది చెప్పారని, లోపల ఏమి చెప్పారో బయటకు వచ్చాక అదే చెప్పారని పేర్కొన్నారు.  ఈటల బీజేపీ నేతగా కాళేశ్వరం కమిషన్ ముందుకు పోలేదని, అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ గానే వెళ్లారని అన్నారు. ‘‘ఈటలను  బీజేపీ స్టాండ్ చెప్పాలని కమిషన్​ అడగలేదు. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగిందో అడిగారు. ఆయన అదే విషయం చెప్పారు’’ అని కిషన్​రెడ్డి పేర్కొన్నారు. తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యలపై ప్రస్తావించగా, ఆయన ఆల్ పార్టీ మినిస్టర్ అని,  టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్నారని అన్నారు.  సీఎం రేవంత్​రెడ్డి ఎన్నికల టైంలో బీఆర్ఎస్ ​ఎమ్మెల్యేల అవినీతిపై మాట్లాడారని, కానీ  ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేదని వ్యాఖ్యానించారు.

​ఏన్డీఎస్ఏ రిపోర్ట్​ను ఎట్లా తప్పుపడ్తరు?

‘‘మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లకు క్రాక్ వచ్చింది నిజమా ? కాదా?..  నిజమే అయినప్పుడు మేడిగడ్డపై ఎన్డీఎస్​ఏ ఇచ్చిన రిపోర్ట్​ను ఎలా తప్పు పడ్తరు” అని బీఆర్ఎస్​ నేతలను కిషన్​రెడ్డి ప్రశ్నించారు.  కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల ఏం ప్రయోజనం జరిగిందో ప్రజలకు చెప్పాలని సవాల్​ విసిరారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి క్లియరెన్స్​ వచ్చిందని, త్వరలోనే ఎన్నిక జరుగుతుందని తెలిపారు.  ‘సేవ్ తెలంగాణ’ నినాదంతో పార్టీ ముందుకు సాగుతుందని చెప్పారు. సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం రూ.42వేల కోట్లు బాకీ పడిందని తెలిపారు.  

సోషల్ మీడియాలో బీజేపీ వార్ 

11 ఏండ్ల బీజేపీ పాలనపై కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నదని, వీటిని తిప్పికొడ్తున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. బీజేపీ సోషల్ మీడియాలో అసలైన వార్ చేస్తున్నదని తెలిపారు. బీజేపీ స్టేట్ఆఫీసులో శనివారం సోషల్ మీడియా వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా అసెంబ్లీపై ఎగిరేది కాషాయ జెండానేనని చెప్పారు.

హైదరాబాద్‌‌లో రఫెల్ తయారీ గొప్ప విషయం: కిషన్​ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: రఫెల్ యుద్ధ విమానాల్లో ప్రధాన భాగమైన ఫ్యూజ్‌‌లాజెస్ వ్యవస్థ హైదరాబాద్‌‌లో తయారు కావడం గొప్ప విషయమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఫ్రాన్స్ బయట ఏర్పాటు చేయబోయే తొలి కేంద్రం కావడంపై శనివారం ‘ఎక్స్’లో ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థ ఏర్పాటుతో తెలంగాణలో విమాన తయారీ పరిశ్రమ విస్తరించేందుకు వీలు కలుగుతుందని చెప్పారు. ఫ్రెంచ్‌‌ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్‌‌డ్‌‌ సిస్టమ్స్‌‌(టీఏఎస్ఎల్)తో ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. దీంతో ప్రపంచ రక్షణ ఉత్పత్తుల సరఫరా చెయిన్‌‌లో భారత్ బలమైన స్థానాన్ని పొందనుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో భారత రక్షణ రంగ ఎగుమతులు అమాంతం పెరిగాయన్నారు. 2013–14లో రూ.686 కోట్లు నుంచి 2024–25 నాటికి రూ.23,622 కోట్లకు ఈ రంగంలో ఎగుమతులు చేరాయని పేర్కొన్నారు. అలాగే 80కి పైగా దేశాలకు భారత రక్షణ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నట్లు వెల్లడించారు.