- మాజీ ఎంపీ సీతారాంనాయక్కు బుజ్జగింపులు
హనుమకొండ, వెలుగు : మహబూబాబాద్ మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నేత అజ్మీరా సీతారాంనాయక్ పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరుగుతుండడంతో బుజ్జగింపులు మొదలయ్యాయి. కేంద్రమంత్రి కిషన్రెడ్డి శుక్రవారం సాయంత్రం హనుమకొండలో సీతారాం నాయక్ను కలిసి, పార్టీలోకి వస్తే తగిన గుర్తింపు ఇస్తామని ఆహ్వానించడంతో ఆయన బీజేపీలో చేరుతున్నట్లు ఉమ్మడి జిల్లాలో ప్రచారం జరిగింది.
దీంతో కేసీఆర్, కేటీఆర్ ఆదేశాలతో బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర్, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్న, దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవరెడ్డి శనివారం సీతారాంనాయక్ ఇంటికి వెళ్లారు. బీఆర్ఎస్లోనే కొనసాగాలని కోరడంతో పాటు భవిష్యత్లో సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఎట్టి పరిస్థితుల్లో పార్టీని వీడి వెళ్లొద్దని, ఒక వేళ వెళ్లినా తమను తిట్టొద్దని, ఎలాంటి కామెంట్స్ చేయొద్దని కోరారు. అయితే బీఆర్ఎస్ లీడర్ల బుజ్జగింపులకు సీతారాంనాయక్ ససేమిరా అన్నట్టు తెలిసింది. అనంతరం సీతారాం నాయక్ను సంప్రదించగా ఇన్ని రోజులు బీఆర్ఎస్లో కనీసం వ్యాల్యూ ఇవ్వలేదన్నారు. తనకు విలువ ఇచ్చి, ఆహ్వానించిన బీజేపీలోకి వెళ్తున్నట్లు స్పష్టం చేశానని చెప్పారు.