డాక్టర్ రేప్, హత్యపై దేశమంతా నిరసన.. ఇవాళ కొన్ని వైద్యసేవలు బంద్

డాక్టర్ రేప్, హత్యపై దేశమంతా నిరసన.. ఇవాళ కొన్ని వైద్యసేవలు బంద్

కోల్ కతా/ న్యూఢిల్లీ: కోల్ కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఓ మహిళా ట్రెయినీ డాక్టర్(31) పై రేప్, హత్య ఘటనకు నిరసనగా సోమవారం దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లో కొన్ని వైద్య సేవలను నిలిపివేయనున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (ఫోర్డా) ప్రకటించింది. ఆర్జీ కర్ రెసిడెంట్ డాక్టర్ల డిమాండ్లను 24 గంటల్లోగా నెరవేర్చి న్యాయం చేయాలని, లేకపోతే వారికి సంఘీభావంగా దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అల్టిమేటం జారీ చేసింది.

 కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు ఫోర్డా ప్రతినిధులు ఆదివారం ఈమేరకు లేఖ రాశారు. డాక్టర్ హత్య కేసులో తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫోర్డా శనివారం కూడా కేంద్ర ఆరోగ్య మంత్రికి లేఖ రాసింది. అయితే, జరిగిన సంఘటన తమను తీవ్రంగా కలచివేసిందని, డిమాండ్లను నెరవేర్చకపోతే ఊరుకోబోమని తాజాగా ఆదివారం నాటి లేఖలో తేల్చిచెప్పింది. 

కేరళలోనూ అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సోమవారం నిరసనలు తెలుపుతామని కేరళ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ టీచర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కోల్ కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో శుక్రవారం ఓ మహిళా రెసిడెంట్ డాక్టర్( పీజీ సెకండ్ ఇయర్) హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. హాస్పిటల్ సెమినార్ హాల్ లో అర్ధనగ్నంగా పడి ఉన్న ఆమె డెడ్ బాడీపై తీవ్రమైన గాయాలను గుర్తించారు. ఆమెపై లైంగిక దాడి చేసిన తర్వాత గొంతు నులిమి చంపేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి సంజయ్ రాయ్ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ముగ్గురు భార్యలు వదిలేశారు..

నిందితుడు సంజయ్ కోల్ కతాలోని శంభునాథ్ పండిట్ కాలనీకి చెందిన వాడని, పోలీస్ శాఖలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంలో వాలంటీర్​గా చేరాడని తెలుస్తోంది. దీనిని అడ్డంపెట్టుకుని అతడు ఓ పోలీస్ ఆఫీసర్​కు పీఏనని, హోంగార్డునని, రకరకాలుగా చెప్పుకుంటూ చెలామణీ అయ్యాడు. ఇటీవల అతడిని ఆర్జీ కర్ హాస్పిటల్ చెక్ పోస్టు వద్ద వాలంటీర్​గా వేశారు. 

అప్పటి నుంచి తరచూ ఆస్పత్రిలోకి వస్తూ పోతూ ఉండేవాడని చెప్తున్నారు. అతడి ఫోన్​లో పోర్న్ వీడియోలు, ఫొటోలను పోలీసులు గుర్తించారు. దీంతో అతడు పోర్న్ కు బానిసై మహిళలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని భావిస్తున్నారు. సంజయ్ నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడని.. రోజూ తాగా వచ్చి చిత్రహింసలు పెట్టడం వల్ల అతడిని ముగ్గురు భార్యలు వదిలేసి పోయారని స్థానికులు వెల్లడించారు. నాలుగో భార్య గత ఏడాది క్యాన్సర్​తో చనిపోయిందని తెలిపారు.

బెంగాల్​లో వైద్య సేవలపై ఎఫెక్ట్

మహిళా డాక్టర్ రేప్, హత్య నేపథ్యంలో బెంగాల్​లోని అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో జూనియర్ డాక్టర్లు, పీజీ డాక్టర్లు, ఇతర స్టాఫ్ వరుసగా మూడో రోజు కూడా నిరసనలు చేపట్టారు. దీంతో ఆదివారం కూడా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగింది.

డెడ్ బాడీపై తీవ్ర గాయాలు

ప్రాథమిక అటాప్సీ రిపోర్ట్ ప్రకారం బాధితురాలి పై లైంగిక దాడి జరిపి హత్య చేసినట్టు తేలిందని పోలీసులు వెల్లడించారు. ‘‘ఆమె కండ్లు, నోటి నుంచి రక్తంకారింది. ముఖంపై గాయాల య్యాయి. నడుము, ఎడమ కాలు, మెడ, కుడి చేయి, వేలు, పెదాలు, మర్మాంగాలపైనా గాయా లు ఉన్నాయి ” అని పోలీసులు తెలిపారు. ‘‘సెమినార్ హాల్​లో బాధితురాలు నిద్రిస్తున్నప్పు డు ఈ దాడి జరిగింది” అని వివరించారు. 

నేరానికి పాల్పడిన తర్వాత నిందితుడు తాను ఉంటున్న ప్లేస్​కు వెళ్లి బట్టలు, బూట్లను శుభ్రం చేసుకున్నాడని, వాటిపై రక్తపు మరకలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు ఘటనా స్థలంలో ఉన్నట్టు సీసీటీవీ ఫుటేజీలో తేలిందని, అక్కడ అతడి బ్లూటూత్ హెడ్ సెట్ కూడా దొరికిందన్నారు.