తండ్రిని డిన్నర్‌కి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య చేసిన కూతురు

తండ్రిని డిన్నర్‌కి తీసుకెళ్లి మద్యం తాగించి హత్య చేసిన కూతురు

తండ్రికి మద్యం తాగించి ఓ కూతురు హత్య చేసిన ఘటన కలకత్తాలో గత ఆదివారం జరిగింది. క్రిస్టోపర్ రోడ్‌లో నివాసముంటున్న 22 ఏళ్ల వివాహిత భర్తతో విడిపోయి తండ్రి వద్ద ఉంటోంది. అయితే ఆ తండ్రి పెళ్లికి ముందు నుంచే యువతిని శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో యువతి అన్నీ భరిస్తూ వచ్చింది.  కాగా.. యువతి భర్త విడిపోయి ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్లీ అదే తంతు మొదలైంది. విసుగు చెందిన యువతి తండ్రిని కడతేర్చాలని భావించింది. అందులో భాగంగా మార్చి 21 తన తండ్రిని తీసుకొని రెస్టారెంట్‌కు వెళ్లింది. అక్కడ తండ్రి కోసం డ్రింక్ ఆర్డర్ చేసింది. అనంతరం ఇద్దరూ భోజనం చేసి స్ట్రాండ్ రోడ్‌లోని చాద్‌పాల్ ఘాట్‌కు వెళ్లారు. అక్కడ తండ్రికూతుళ్లిద్దరూ మాట్లాడుకుంటుండగా.. మత్తులో ఉన్న తండ్రి నిద్రలోకి జారుకున్నాడు. ఆ సమయాన్ని తన అనుకూలంగా మార్చుకున్న కూతురు.. తండ్రి మీద కిరోసిన్ పోసి నిప్పంటించింది. మద్యం మత్తులో ఉన్న తండ్రి తప్పించుకోలేక అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయింది. నిందితురాలి మేనమామ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువతిని అరెస్టు చేశామని తెలిపారు.