కార్యకర్తల జోలికి వస్తే క్రేనుకు ఉరివేసి వేలాడదీస్తా : కొండా మురళి

కార్యకర్తల జోలికి వస్తే క్రేనుకు ఉరివేసి వేలాడదీస్తా :  కొండా మురళి

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికార పార్టీ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే  క్రేనుకు ఉరివేసి వేలాడదీస్తానని హెచ్చరించారు.  ముందు పోలీసులకు వాళ్లపై ఫిర్యాదు చేస్తామని.. వాళ్లు చర్యలు తీసుకోకపోతే పాత మురళిని చూపిస్తానంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.  

వరంగల్ నగరంలోని లేబర్ కాలనీలో బీఆర్ఎస్, బీజేపీకి చెందిన కార్యకర్తలు కొండా మురళి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.   ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కొండా మురళి మాట్లాడారు.   కార్యకర్తలకు తాను 24 గంటలు అందుబాటులో ఉంటానని తెలిపారు. కార్యకర్తలను ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే పాత కొండా మురళిని చూస్తారని పేర్కొన్నారు.

బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకోను అంటూ ప్రత్యర్థులను గట్టిగా హెచ్చరించారు.  కొండా మురళి  పనైపోయిందని కొందరు  దుష్ప్రచారం  చేస్తున్నారని అన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో భార్య కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ తరఫున వరంగల్ తూర్పు నుండి పోటీ చేస్తుందని మురళి స్పష్టం చేశారు.  కొండా మురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాశంగా మారాయి.