మంత్రిగా కొండా సురేఖ బర్తరఫ్ తో అటు అధికార కాంగ్రెస్, ఇటు తెలంగాణ పాలిటిక్స్ వేడెక్కాయి. గురువారం ( సెప్టెంబర్ 3 ) బర్తరఫ్ తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొండా సురేఖ. తమ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్సీకి భార్య కూడా ఓటు వేయరని.. అలంటి వ్యక్తి నా మీద మాట్లాడుతున్నారని అన్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా హ్యాపీగా ఉన్నారా..? ఇబ్బంది పడుతున్నవారంతా బయటికి వచ్చి మాట్లాడండంటూ పిలుపునిచ్చారు కొండా సురేఖ.
తనకు మంత్రి పదవి పోయిందని బాధ లేదని.. చెప్పకుండా తప్పించారు అనేది బాధ ఉందని అన్నారు. మంత్రులు దరఖాస్తులు ఇస్తే పనులు కావడం లేదని.. దరఖాస్తులు దరఖాస్తు దశలోనే ఉంటున్నాయని అన్నారు కొండా సురేఖ. ప్రభుత్వ పథకాల అమల్లో జాప్యం జరుగుతోందని.. ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. ఎన్నికల కంటే ముందే ప్రభుత్వం సర్వే చేసుకుంటే మంచిదని అన్నారు కొండా సురేఖ.
మంత్రిగా రాజీనామా చేయమని అధిష్టానం పెద్దలు తనకు చెప్పలేదని.. ఎవరూ ఆదేశించలేదని అన్నారు. కొంత మంది ఒత్తిడిలకు లొంగి బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కొండా సురేఖ. మంత్రిగా తనను తొలగించినప్పటికీ పార్టీకి రాజీనామా చేయట్లేదని.. ఎమ్మెల్యేగా కొనసాగుతూ ప్రజలకు సేవ చేస్తానని అన్నారు కొండా సురేఖ.
