నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం : మంత్రి కొండా సురేఖ

నా మంత్రి పదవి పోతుందని తప్పుడు ప్రచారం : మంత్రి కొండా సురేఖ
  • కడియం శ్రీహరి గ్రూపులను ప్రోత్సహిస్తున్నరు
  • చిట్‌‌‌‌చాట్‌‌‌‌లో మంత్రి కొండా సురేఖ

హైదరాబాద్, వెలుగు : ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాను చేసే అభివృద్ధిని కొంత మంది కాంగ్రెస్​నేతలే అడ్డుకుంటున్నారని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సెక్రటేరియట్‌‌‌‌లో మంత్రి సురేఖ మీడియాతో చిట్‌‌‌‌చాట్‌‌‌‌ చేశారు. ఈ సందర్బంగా వరంగల్‌‌‌‌లో ఎమ్మెల్యేల భేటీపై స్పందించారు. ‘భద్రకాళి టెంపుల్ బోనాలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.

ఆగమశాస్త్రం ప్రకారమే అమ్మవారికి బోనం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నాం. కానీ అక్కడ యాటలు కోస్తారని ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌‌‌‌ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.’ అని మంత్రి సురేఖ ఆరోపించారు. తాను మంత్రిగా ఉంటే తన ముందు కూర్చోవడానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నామోషీగా ఫీల్ అవుతున్నారని, అందుకే తన మంత్రి పదవి పోతుందంటూ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఫైర్​అయ్యారు.

మంత్రివర్గ విస్తరణ పూర్తయినప్పటికీ తన మీద సీఎంకు, కేసీ వేణుగోపాల్‌‌‌‌కు ఫిర్యాదు చేయిస్తున్నారని మండిపడ్డారు. ‘కడియం శ్రీహరి నల్లికుట్ల మనిషి.. జిల్లాలో గ్రూపు తగాదాలు ప్రోత్సహిస్తున్నారు. నాకు అదృష్టం ఉండి నేను మంత్రి అయ్యాను. ఆయన ( కడియం) బిడ్డకు అదృష్టం ఉంది కాబట్టి ఆమె (కావ్య) ఎంపీ అయింది.. నా బిడ్డకు అదృష్టం లేదు, ఎమ్మెల్యే కాలేదు.. అలా అని ఆమె పదవి నేను తీసేయాలని అనుకుంటున్నానా ? మరి నా మంత్రి పదవి ఎందుకు తీసేయాలని అనుకుంటున్నారు..’ అని ప్రశ్నించారు.  కాగా,  రాష్ట్రంలో గోదావరి పుష్కరాలకు రూ.200 కోట్ల నిధులు కేటాయించాలని కేంద్రానికి లేఖ రాసినట్లు మంత్రి సురేఖ తెలిపారు. నిధులు తెచ్చేలా కేంద్రమంత్రులు కిషన్‌‌‌‌రెడ్డి, బండి సంజయ్ చొరవ తీసుకోవాలని, లేదంటే చేతగాని మంత్రులుగా మిగిలిపోతారన్నారు.