ఇస్కాన్ సేవలు భేష్ : కొండా సురేఖ

ఇస్కాన్ సేవలు భేష్ : కొండా సురేఖ
  • సర్కారు నుంచి పూర్తి సహకారం: కొండా సురేఖ 

హైదరాబాద్, వెలుగు: సమాజాన్ని ఆధ్యాత్మిక చింతన వైపు తీసుకెళుతున్న ఇస్కాన్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో జరిగిన రథయాత్ర వేడుకలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సనాతన ధర్మం, సంస్కృతి పరిరక్షణకు జగన్నాథ రథయాత్ర వంటి వేడుకలు దోహదం చేస్తాయన్నారు. ఈ మహోత్సవాన్ని ప్రపంచం నలుమూలలకు తీసుకెళ్లిన మహనీయుడు భక్తివేదాంత స్వామి ప్రభుపాదులు అని కొనియాడారు. మొత్తం 1,100 కంటే ఎక్కువ ఇస్కాన్  కేంద్రాలలో రథయాత్రలు ఘనంగా నిర్వహిస్తుండటం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ఇస్కాన్ సంస్థ సనాతన ధర్మాన్ని, భారతీయ సంస్కృతిని సంరక్షిస్తూ సమాజానికి, ముఖ్యంగా యువతకు దిశానిర్దేశం చేస్తూ అద్భుతమైన సేవ చేస్తున్నదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇస్కాన్ సేవా కార్యక్రమాలకు సంపూర్ణ సహకారం అందించడానికి కట్టుబడి ఉందన్నారు. హైదరాబాద్ నల్లగండ్లలో 6,000 గజాల స్థలాన్ని ఇస్కాన్ ఆలయం, మెగా కమ్యూనిటీ కిచెన్, గోశాల నిర్మాణం కోసం కేటాయించామన్నారు. సామాజిక, ఆధ్యాత్మిక, సస్టైనబుల్ కార్యకలాపాలలో మరింత చురుకుగా ఇస్కాన్ సంస్థ పాల్గొని సమాజానికి ఎంతో ఉపయోగకరంగా మారాలని ఆకాంక్షించారు.