వెలుగు, నెట్వర్క్: బీఈడీ, ఎంఈడీ లాంటి విద్యార్హతలు ఏవీ లేకున్నా.. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్న కొడుకు కొప్పుల శ్రీధర్ గురుకుల స్కూల్ కు ప్రిన్సిపాల్ గా నియమితులయ్యారు. అర్హతలు లేవని డిపార్ట్ మెంట్ టర్మినేట్ చేసిన ఐదు రోజులకే ఆయనకు మరో చోట ప్రిన్సిపాల్గా పోస్టింగ్ ఇచ్చారు. దీంతో మంత్రి, ఉన్నతాధికారుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఇంజినీరింగ్ చదివిన శ్రీధర్ గురుకులాల్లో అకడమిక్ కో ఆర్డినేటర్గా చేరారు. ఆ వెంటనే చెన్నూర్ మైనారిటీ గురుకులం ప్రిన్సిపాల్గా వెళ్లారు. అక్కడ శ్రీధర్పై పలు ఆరోపణలు రావడంతో విజిలెన్స్ విచారణ జరిగింది. ప్రిన్సిపాల్కు కావాల్సిన విద్యార్హతలు లేవని నివేదిక ఇవ్వడంతో ఆయనను విధుల్లోంచి టర్మినేట్ చేశారు. ఇది జరిగిన 5 రోజులకే మంత్రి అండతో మళ్లీ రామగుండంలోని మైనార్టీ గురుకుల స్కూల్ ప్రిన్సిపాల్గా అవకాశం కల్పించడం డిపార్ట్మెంట్లో హాట్టాపిక్గా మారింది.
కో ఆర్డినేటర్ టు ప్రిన్సిపాల్..
గోదావరిఖనిలోని జవహర్నగర్కు చెందిన కొప్పుల లక్ష్మీరాజం మంత్రి కొప్పుల ఈశ్వర్కు స్వయానా అన్న. లక్ష్మీరాజం పెద్ద కొడుకైన కొప్పుల శ్రీధర్ ఇంజినీరింగ్ చేశారు. ఆ తర్వాత చిన్నా చితక పనులు చేసిన ఈయన, తన బాబాయ్ కొప్పుల ఈశ్వర్ మంత్రి కాగానే మైనార్టీ గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నడుస్తున్న స్కూళ్లను పర్యవేక్షించేందుకు అకడమిక్ కో ఆర్డినేటర్గా 2021‒22లో చేరారు. రెండు జిల్లాల పరిధిలోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో సొసైటీ నిబంధనల ప్రకారం స్టూడెంట్లకు సిలబస్ చెబుతున్నారా? మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? లాంటి వ్యవహారాలు చూసేవారు. ఈ క్రమంలో గురుకుల ప్రిన్సిపాల్ పోస్టు కావాలనుకున్న ఆయన.. మంత్రి ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. దీంతో 2022 డిసెంబర్లో మంచిర్యాల జిల్లా చెన్నూర్ మైనార్టీ గురుకుల స్కూల్(బాయ్స్‒1) ప్రిన్సిపాల్గా శ్రీధర్ను నియమిస్తూ ఉన్నతాధికారులు ఆర్డర్ ఇచ్చారు.
విద్యార్హతలు లేవని టర్మినేషన్
చెన్నూర్ మైనార్టీ గురుకుల స్కూల్లో కొప్పుల శ్రీధర్ ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన తీరు వివాదాస్పదంగా ఉండేది. స్టూడెంట్లను టార్చర్ చేయడం, టీచర్ల కొరతపై అడిగితే టీసీ ఇచ్చి ఇంటికి పంపిస్తానని బెదిరించడం, మంత్రి కొప్పుల ఈశ్వర్ తన బాబాయ్ అని, ఎవరూ ఏమీ చేయలేరని బెదిరిస్తూ స్టూడెంట్లతో కాళ్లు మొక్కించుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను తొలగించాలంటూ హాస్టల్ స్టూడెంట్లు, విద్యార్థి సంఘాల లీడర్లు, పలువురు రాజకీయ నాయకులు ఆందోళన చేపట్టి, మంచిర్యాల జిల్లా మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. దీంతో జులై 17న మంచిర్యాల జిల్లా విజిలెన్స్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి, నివేదిక అందించారు. దాని ఆధారంగా జిల్లా మైనార్టీస్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎన్.రాజేశ్వరి శ్రీధర్ను పదవి నుంచి తొలగించాలని సూచిస్తూ జులై 29న మైనార్టీస్ గురుకుల స్కూల్స్ సొసైటీ సెక్రటరీకి లెటర్ పంపారు. దీంతో అదే రోజు శ్రీధర్ను ప్రిన్సిపాల్ పదవి నుంచి టర్మినేట్ చేశారు.
ఐదు రోజులకే మళ్లీ పోస్ట్
టర్మినేట్ చేసిన 5 రోజులకే కొప్పుల శ్రీధర్ను ఈ సారి రామగుండంలోని మైనార్టీ బాయ్స్ గురుకుల స్కూల్కు ప్రిన్సిపాల్గా నియమించారు. అక్కడ ప్రిన్సిపాల్ పదవికి అర్హత కలిగిన ఇద్దరు టీచర్లు ఉన్నా.. వారిని కాదని మంత్రి బంధువు శ్రీధర్ను ప్రిన్సిపాల్ గా నియమించారు. గురుకులాలకు ఔట్ సోర్సింగ్ లో మ్యాన్ పవర్ సప్లై చేసే ‘ఎస్ఎస్వీ ఎంటర్ ప్రైజెస్’ అనే ప్రైవేట్ ఏజెన్సీ ద్వారా ఈ నియామకం చేపట్టారు.
