
- పాల్వంచ మున్సిపాలిటీతో పాటు
- ఏడు పంచాయతీలు కార్పొరేషన్లోనే
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్ గా మారింది. కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు పాలు సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. కార్పొరేషన్ ఏర్పాటుపై ఇప్పటికే గెజిట్రిలీజ్ అయింది. కార్పొరేషన్ కమిషనర్గా పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సుజాతను పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో నియమిస్తూ మున్సిపల్శాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
కొత్తగా కమిషనర్ వచ్చేంత వరకు ఈ బాధ్యతల్లో సుజాత కొనసాగుతారు. ఇప్పటి నుంచి పాల్వంచ మున్సిపాలిటీతో పాటు సుజాతనగర్ మండలంలోని మంగపేట, సుజాతనగర్, నర్సింహసాగర్, కొమిటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, నాయకుల గూడెం గ్రామపంచాయతీలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోనే జరుగనున్నాయి. ఆయా గ్రామపంచాయతీల విలీన ప్రక్రియను చేపట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి.
సబ్ డివిజన్ల ఏర్పాటు..
పాలనా సౌలభ్యంలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచే కార్పొరేషన్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్పొరేషన్లో విలీనం అయిన పాల్వంచ మున్సిపాలిటీని సబ్ జోన్గా విభజించనున్నారు. ఇదే క్రమంలో సుజాతనగర్ మండలంలోని మంగపేట, సుజాతనగర్, నర్సింహసాగర్, కొమిటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, నాయకుల గూడెం గ్రామపంచాయతీలకు గానూ మరో సబ్ జోనల్ ఆఫీస్ను ఏర్పాటు చేసే అవకాశాలను ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు.