కార్పొరేషన్​గా మారిన కొత్తగూడెం..జీవో రిలీజ్​చేసిన ప్రభుత్వం

కార్పొరేషన్​గా మారిన కొత్తగూడెం..జీవో రిలీజ్​చేసిన ప్రభుత్వం
  • పాల్వంచ మున్సిపాలిటీతో పాటు 
  • ఏడు పంచాయతీలు కార్పొరేషన్​లోనే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : కొత్తగూడెం మున్సిపాలిటీ ఇక కార్పొరేషన్​ గా మారింది. కొత్తగూడెం–పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు పాలు సుజాతనగర్​ మండలంలోని ఏడు పంచాయతీలను కలుపుతూ కొత్తగూడెం కార్పొరేషన్​ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం జీవో  జారీ చేసింది. కార్పొరేషన్​ ఏర్పాటుపై ఇప్పటికే గెజిట్​రిలీజ్​ అయింది. కార్పొరేషన్​ కమిషనర్​గా పాల్వంచ మున్సిపల్​ కమిషనర్​ సుజాతను పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో నియమిస్తూ మున్సిపల్​శాఖ  నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

కొత్తగా కమిషనర్​ వచ్చేంత వరకు ఈ బాధ్యతల్లో సుజాత కొనసాగుతారు. ఇప్పటి నుంచి పాల్వంచ మున్సిపాలిటీతో పాటు సుజాతనగర్​ మండలంలోని మంగపేట, సుజాతనగర్​, నర్సింహసాగర్​, కొమిటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, నాయకుల గూడెం గ్రామపంచాయతీలకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు కొత్తగూడెం కార్పొరేషన్​ పరిధిలోనే జరుగనున్నాయి. ఆయా గ్రామపంచాయతీల విలీన ప్రక్రియను చేపట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. 

సబ్​ డివిజన్ల ఏర్పాటు..

పాలనా సౌలభ్యంలో భాగంగా కొత్తగూడెం మున్సిపాలిటీ నుంచే  కార్పొరేషన్​ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కార్పొరేషన్​లో విలీనం అయిన పాల్వంచ మున్సిపాలిటీని సబ్​ జోన్​గా విభజించనున్నారు. ఇదే క్రమంలో సుజాతనగర్​ మండలంలోని మంగపేట, సుజాతనగర్​, నర్సింహసాగర్​, కొమిటిపల్లి, లక్ష్మీదేవిపల్లి, నిమ్మలగూడెం, నాయకుల గూడెం గ్రామపంచాయతీలకు గానూ మరో సబ్​ జోనల్​ ఆఫీస్​ను ఏర్పాటు చేసే అవకాశాలను ఆఫీసర్లు పరిశీలిస్తున్నారు.