
- ఏపీకి 15 టీఎంసీల కేటాయింపు
- కృష్ణా బోర్డు నిర్ణయం
హైదరాబాద్, వెలుగు: కృష్ణా నది కామన్ ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ కు సుమారు 15 టీఎంసీలు కేటాయిస్తూ కృష్ణా బోర్డు వాటర్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చింది. తమ రాష్ట్రంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొందని, 12 టీఎంసీల నీటిని కేటాయించాలని ఏపీ ఈఎన్సీ సోమవారం త్రీమెన్ కమిటీని కోరారు. ఏపీ కోరినదాంట్లో 11 టీఎంసీల నీటిని ఇవ్వడంతోపాటు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కేటాయింపుల్లో ఉపయోగించుకోకుండా మిగిలిన ఇంకో 3.92 టీఎంసీలను మే నెలాఖరు వరకు తీసుకోవాలని బోర్డు సూచించింది. తెలంగాణకు చేసిన కేటాయింపుల్లో సుమారు 2 టీఎంసీల నీటిని కోత పెట్టింది. శ్రీశైలం రిజర్వాయర్లో ఈ నెల 20 నాటికి 37.14 టీఎంసీల నీళ్లుండగా 807 అడుగులకు పైన 4.53 టీఎంసీలున్నాయి. నాగార్జునసాగర్లో 194.85 టీఎంసీల నీళ్లుండగా 510 అడుగుల మట్టానికి ఎగువన 63.71 టీఎంసీలున్నాయి. రెండు ప్రాజెక్టుల్లో కలిపి 67.71 టీఎంసీలున్నట్టుగా బోర్డు రిలీజ్ ఆర్డర్లో పేర్కొంది. ఏపీ ఈఎన్సీ హంద్రీనీవా– ముచ్చుమర్రికి 2 టీఎంసీలు, నాగార్జున సాగర్ కుడికాలువకు 10 టీఎంసీలు ఇవ్వాలని ఇండెంట్లో కోరారు. శ్రీశైలంలో నీళ్లు లేనందున హంద్రీనీవాకు ఒక టీఎంసీనే ఇస్తామని బోర్డు స్పష్టం చేసింది. నాగార్జునసాగర్ నుంచి కుడికాలువకు 10 టీఎంసీలు, ఎడమ కాలువకు పెండింగ్ ఉన్న 3.92 టీఎంసీల నీటిని తీసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ మొత్తంగా 14.92 టీఎంసీలను మే నెలాఖరు వరకు తీసుకోవాలని బోర్డు సూచించింది.
మనకు ఆగస్టు వరకు నీళ్లు
కేటాయించిన మేరకు తెలంగాణ నీటిని ఉయోగించుకోకపోవడంతో ఆగస్టు నెలాఖరు వరకు నీటిని తీసుకునేందుకు కృష్ణా బోర్డు ఓకే చెప్పింది. ఈ వాటర్ ఇయర్లో తెలంగాణకు 245.89 టీఎంసీల నీటిని కేటాయించగా ఈ నెల 20 వరకు 193.68 టీఎంసీలు మాత్రమే తీసుకోగలిగింది. శ్రీశైలం, నాగార్జుసాగర్ రెండు ప్రాజెక్టుల్లో సరిపడా నీటి నిల్వలు లేకపోవడంతో తెలంగాణకు 1.94 టీఎంసీల నీటికి బోర్డు కోత పెట్టింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తికి 2 టీఎంసీలు, నాగార్జున సాగర్ నుంచి ఎడమ కాలువకు 28.22 టీఎంసీలు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ వాటర్ బోర్డుకు 21.98 టీఎంసీల నీటిని బోర్డు గతంలో కేటాయించింది. ఈ నీటిని ఆగస్టు 31వరకు తీసుకోవడానికి త్రీమెన్ కమిటీ ఆమోదం తెలిపింది.