ఉర్దూ వర్సిటీని నాశనం చేసే కుట్ర : కేటీఆర్

ఉర్దూ వర్సిటీని నాశనం చేసే కుట్ర : కేటీఆర్
  •     50 ఎకరాల భూమిని అక్రమంగా గుంజుకునే ప్రయత్నాలు: కేటీఆర్
  •     దీనిపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్న
  •     మౌలానా ఆజాద్​ ఉర్దూ వర్సిటీ స్టూడెంట్లతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: దేశంలోని ఏకైక ఉర్దూ యూనివర్సిటీని కాంగ్రెస్​ ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని బీఆర్‌‌ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు. యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిని అక్రమంగా తీసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం సీరియల్​ కిల్లర్​మాదిరి.. సీరియల్​ ల్యాండ్​ స్నాచర్​గా మారిందని మండిపడ్డారు. 

అన్ని యూనివర్సిటీల భూములను గుంజుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నదన్నారు. ముందు హైకోర్టు కోసమని అగ్రికల్చర్  వర్సిటీ భూములను తీసుకున్న ప్రభుత్వం.. ఆపై హెచ్​సీయూకు చెందిన 400 ఎకరాలను కబ్జా చేసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. శుక్రవారం ఆయన నందినగర్​లోని తన నివాసంలో మౌలానా ఆజాద్​ యూనివర్సిటీ విద్యార్థులతో సమావేశమయ్యారు. 

అనంతరం మీడియాతో మాట్లాడారు. సెంట్రల్​ యూనివర్సిటీ భూములను గుంజుకునే ప్రయత్నం చేసినా కేంద్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. అయితే, విద్యార్థుల ఆందోళన, ప్రజల వ్యతిరేకత, సుప్రీంకోర్టు జోక్యంతో రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గిందన్నారు. హెచ్​సీయూ భూముల వ్యవహారంలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని సుప్రీంకోర్టు చెప్పినా.. ఇప్పటికీ కేంద్రం ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు.   

భూముల కబ్జాను పట్టించుకోరా?

దేశంలో మైనారిటీల సంరక్షకుడినని చెప్పుకునే కాంగ్రెస్‌ లీడర్‌‌ రాహుల్​ గాంధీ.. ఉర్దూ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం కబ్జా చేస్తున్నా పట్టించుకోకపోవుడేందని కేటీఆర్ ప్రశ్నించారు. రాహుల్​ చెప్తున్న మొహబ్బత్​ కీ దుకాణ్​ ఇదేనా అని నిలదీశారు. మొహబ్బత్​ అంటే విద్యార్థులను రోడ్డున పడేయడమేనా అని అన్నారు.

యూనివర్సిటీల్లో ఉన్న భూములు.. వర్సిటీల భవిష్యత్​ విస్తరణ కోసమని చెప్పారు. తెలంగాణ ఉద్యమం వల్లే హైదరాబాద్​ సెంట్రల్​ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీలు ఏర్పడ్డాయన్నారు. ఉద్యమాలతో ఏర్పడిన యూనవర్సిటీ భూములను రియల్​ఎస్టేట్​ కోసం వాడుకోవడం దారుణమన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వాలని అడిగిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్​ చేశారని కేటీఆర్​ అన్నారు. 

రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్​ గాంధీ ఎందుకు పోజులు కొట్టారన్నారు. అశోక్​నగర్​లో రాహుల్​ గాంధీ విద్యార్థులతో ముచ్చటపెట్టి ఉద్యోగాల పేరుతో మోసం చేసింది నిజం కాదా అని మండిపడ్డారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో బట్టల దుకాణం, సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి రేవంత్​ రెడ్డి వెళ్తే.. పోలీసులు విద్యార్థులను అరెస్ట్​ చేసి స్టేషన్లు మార్చిమార్చి తిప్పుతున్నారన్నారు.