
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, వెలుగు : రాజకీయాల్లో కక్ష సాధింపు, ప్రతీకారాలకు చోటు ఉండకూడదని తాను కోరుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కానీ, దురదృష్టవశాత్తు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలనను గాలికొదిలేసి రాజకీయ కక్షలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందని ఆరోపించారు. పరిమితులను దాటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ మీద దుష్ప్రచారాలు చేస్తోందని బుధవారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు.
ఇలాంటి ప్రయత్నాలు ఎక్కువ కాలం నిలబడవని, సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఈ మేరకు స్పష్టం చేసిందన్నారు. విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కేసీఆర్ ను బద్నాం చేసేందుకు ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని సుప్రీం తప్పుబట్టిందన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలికాలని సూచించారు.