పదేళ్ల ధ్వంసం కాదు.. 50 ఏళ్ల విధ్వంసం చూడండి :కేటీఆర్

పదేళ్ల ధ్వంసం కాదు.. 50 ఏళ్ల విధ్వంసం చూడండి :కేటీఆర్

గవర్నర్ ప్రసంగం విని ఒక సభ్యుడిగా సిగ్గుపడుతున్నానన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కొత్త ప్రభుత్వానికి  మూడు నెలల టైం ఇద్దామనుకున్నాం.. ఒక్కరు మాట్లాడితే మంత్రులందరూ లేస్తున్నారని ధ్వజమెత్తారు.  మందబలంతో శాసిద్దామంటే. తప్పులు ఒప్పులు కావన్నారు. దాచేస్తే దాగనిది కాంగ్రెస్ చరిత్రని కేటీఆర్ మండిపడ్డారు. 

కాంగ్రెస్ దురాగాతాలను ప్రజలకు బరాబర్ చెప్తామన్నారు. పదేళ్ల ధ్వంసం అంటేనే .. 50 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడామన్నారు కేటీఆర్.  కాంగ్రెస్ పాలనలో బొంబాయి,దుబాయ్ ,బొగ్గుబాయి తప్ప ఏం లేదన్నారు. నిర్మాణాత్మక సూచనలు ఏమిచ్చినా  స్వీకరిస్తామన్నారు. కృష్ణా జలాలు తరలించుకుపోతే హారతులు పట్టింది కాంగ్రెస్ వాళ్లేనని విమర్శించారు.

గవర్నర్ ప్రసంగం అసత్యాలు,తప్పుల తడకని ధ్వజమెత్తారు. గవర్నర్ ప్రసంగాన్ని పూర్తిగా తప్పుబడుతున్నామని చెప్పారు. గవర్నర్ ప్రసంగంలో అన్నీ సత్యదూరమేనన్నారు. ఎక్కడున్నా తాము ప్రజల తరపున  గొంతు విప్పుతామన్నారు. తాము గవర్నర్ ప్రసంగం నుంచి ఆశించిందొకటి..చెప్పిందొకటన్నారు. కాంగ్రెస్ హయాంలో పాలన ఎలా ఉందో ప్రజలు చూశారని చెప్పారు. 

2014 కంటే ముందు తెలంగాణ ఎలా ఉండేదని ప్రశ్నించారు కేటీఆర్.  గత కాంగ్రెస్  ప్రభుత్వంలో  సాగు, తాగు నీళ్లకు దిక్కు లేదన్నారు. విద్యుత్ లేక పంటు ఎండిపోయాయన్నారు. ఎక్కడ చూసినా ఆత్మహత్యలు..ఆకలికేకలు  ఉండేవన్నారు .   నల్గొండలో ఫ్లోరిన్  తప్ప ఏమోచ్చిందని ప్రశ్నించారు. 

కేటీఆర్ మాట్లాడుతుండగా.. బీఆర్ఎస్ నేతలు విమర్శలకు పోవొద్దన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నిర్మాణాత్మక సూచనలు తీసుకుంటామన్నారు. లక్ష కోట్లు ఖర్చు  చేసి ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా అని ప్రశ్నించారు భట్టి.