
ట్రిబుల్ఆర్ లోని నాటు నాటు పాటకు ఆస్కార్ రావడంపై సినీ ప్రముఖులు, రాజకీయ వేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ ని టార్గెల్ చేసి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఆర్ఆర్ఆర్ విజయాన్ని మోడీ ఖాతాలో వేసుకుంటారేమే. మోడీ వల్లే ఆస్కార్ వచ్చిందని ప్రచారం చేస్తారేమే’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలతో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ మధ్య మరొకసారి పోరు మొదలయింది.
అయితే, గతంలో ఆర్ఆర్ఆర్ టీజర్ విడుదలైన టైంలో బండి సంజయ్ చేసిన కామెంట్లు దూమారం రేపాయి. కుమ్రం భీం జయంతి సందర్భంగా సినిమా టీజర్ విడుదల చేశారు. అందులో భీం పాత్రలో నటించిన ఎన్టీఆర్ సినిమాలో తలకు టోపీ పెట్టుకొని కనిపించాడు. అది చూసిన బండి సంజయ్ నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కుమ్రం భీంకు టోపీ పెట్టడం ఏంటని మండిపడ్డారు. రాజమౌళికి నిజంగా దమ్ము, ధైర్యముంటే నిజాం రజాకార్లకు బొట్లు పెట్టి సినిమా తీయాలన్నారు. సినిమాను విడుదల చేస్తే థియేటర్లను తగలబెడతాం అంటూ వ్యాఖ్యానించారు.
ఈ విషయాన్ని ఇప్పుడు బయటికి తీసిన బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై వ్యంగ్యంగా కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో బీజేపీ వర్సెర్ బీఆర్ఎస్ గా మారింది. అప్పట్లో ట్రిపుల్ ఆర్పై నోరు పారేసుకున్న వ్యక్తే ఇప్పుడు ఆస్కార్ వచ్చిందని శుభాకాంక్షలు చెప్పడంపై విమర్శిస్తున్నారు.