
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు. అంతర్గత విషయాలు బయటమాట్లాడకపోతనే మంచిదని కవితను పరోక్షంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ లో ఎవరైనా సూచనలు ఇవ్వొచ్చు..లేఖలు రాయొచ్చని చెప్పారు. బీఆర్ఎస్ లో ప్రజాస్వామిక స్ఫూర్తి ఉందన్నారు. గతంలోనూ అధినేతకు లేఖలు రాసిన వారు ఉన్నారని చెప్పారు.అన్ని పార్టీల్లో కోవర్టులు ఉంటారని.. తమ పార్టీలోనూ రేవంత్ కోవర్టులు ఉండొచ్చని వ్యాఖ్యానించారు కేటీఆర్. పార్టీలో అందరం కార్యకర్తలమే..అందరూ సమానమేనన్నారు.
ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే దెయ్యం,దేవుడు గురించి ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి.. తెలంగాణకుపట్టిన శని కాంగ్రెస్ అని ఆ దెయ్యాన్ని..శనిని వదిలించడమే తమ పని అన్నారు కేటీఆర్. రేవంత్ కు బ్యాగ్ మాన్ అనే పేరు వచ్చిందన్నారు కేటీఆర్. యంగ్ ఇండియా పేరుతో రేవంత్ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నేషనల్ హెరాల్డ్, మనీ లాండరింగ్ కేసులో రేవంత్ పేరు ఉందని.. సీఎం పేరు ఈడీ చార్జ్ షీట్ లో వచ్చిందన్నారు. తెలంగాణకు ఇది అవమానమని అన్నారు. రేవంత్ బుద్ధి, వైఖరి మారడం లేదన్నారు. రూ.50కోట్లు పెట్టి పీసీసీ చీఫ్ పదవి కొన్నారని మంత్రి కోమటిరెడ్డి గతంలోనే వ్యాఖ్యలు చేశారని చెప్పారు.
కర్ణాటకలో యాడ్యుప్పపై విమర్శలు వస్తే రిజైన్ చెయ్యాలని ఆనాడు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేయలేదా అని ప్రశ్నించారు కేటీఆర్. రేవంత్ తెలంగాణ సొమ్మును దోచి ఢిల్లీ బాసులకు పెడుతున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ మాటల ముఖ్యమంత్రి కాదు..మూటల ముఖ్యమంత్రి అని అన్నారు. ఓటుకు నోటు కేసు ఇంకా ఎవరూ మర్చిపోలేదన్నారు. ఇపుడు సీటుకు రూటు కుంభకోణం బయటపడిందన్నారు కేటీఆర్.