షాద్నగర్, వెలుగు: ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేళ్లలో 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే టార్గెట్గా పనిచేస్తామని కేటీఆర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలం పెంజర్ల శివారులో ప్రాక్టర్అండ్ గ్యాంబిల్(పీఅండ్బీ) రూ.రెండు వందల కోట్ల ఖర్చుతో నిర్మించిన లిక్విడ్ డిటర్జెంట్ తయారీ ఫెసిలిటీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తామని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ పెట్టుబడిదారులు ఉత్సాహం చూపుతున్నారని, వారికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నామని పేర్కొన్నారు. స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి కేటీఆర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబిల్కు సూచించారు. ఈ ప్లాంటు ఇన్వెస్ట్మెంట్ను కలుపుకుంటే తెలంగాణలో పీ అండ్ జీ పెట్టుబడుల విలువ భారీగా పెరిగిందని మంత్రి వివరించారు.
కంపెనీ ఇండియన్ సబ్కాంటినెంట్ సీఈఓ మధుసూదన్ గోపాలన్ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో బిజినెస్ చేయడం చాలా ఈజీ కాబట్టే మా ప్లాంటు కోసం కొత్తూరును ఎంచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఇండస్ట్రియల్ పాలసీలు బాగున్నాయి. మౌలిక సదుపాయాలూ మమ్మల్ని ఆకట్టుకున్నాయి. ఇక్కడ తయారైన ప్రొడక్టులను దేశమంతటా అమ్ముతాం. మా బిజినెస్కు హైదరాబాద్ మార్కెట్ చాలా ముఖ్యం. ఈ ప్లాంటుతోపాటు ప్లానింగ్ సర్వీస్ సెంటర్ను, టెక్నాలజీ సెంటర్ను ఏర్పాటు చేశాం”అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహబూబ్ నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి,షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ లు హాజరయ్యారు. పీ అండ్జీకి ఈ యూనిట్ ఇండియాలోనే అతిపెద్దది. దీనిని 170 ఎకరాల్లో నిర్మించారు. ఇక్కడ ఏరియల్, టైడ్ వంటి వాషింగ్ పౌడర్లు, పాంపర్స్ బ్రాండ్ బేబీ కేర్ ప్రొడక్టులు తయారు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ కార్యక్రమం కోసం వచ్చిన మీడియా వారికి చేదు అనుభవం ఎదురైంది. చాలాసేపు మీడియా ప్రతినిధులు గేట్ బయటే పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇతర నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులకు అనుమతి ఇచ్చారు. మీడియాకు మాత్రం అవకాశం ఇవ్వలేదు.