హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పీఆర్వో మహేష్ను బొల్లారం పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ నెల 8న బొల్లారం చెక్పోస్టు వద్ద విధులు నిర్వహిస్తున్న బేగంపేట ఏసీపీ గోపాల కృష్ణమూర్తి సహా పోలీస్ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించడంతో పాటు విధులకు ఆటంకం కలిగించారని నమోదైన కేసులో అదుపులోకి తీసుకుని బొల్లారం పీఎస్కు తరలించారు.
అసెంబ్లీ సమావేశాల మొదటి రోజున గేట్ నంబర్ 3 వద్ద జరిగిన ఘటనకు సంబంధించి నమోదైన కేసులో సైఫాబాద్ పోలీసుల విచారణకు హాజరై తిరిగి వెళ్తున్న మహేష్ను పీఎస్ వద్దనే అరెస్ట్ చేశారు. బొల్లారం ఎస్సై సన్నీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 132, 223 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ అనంతరం శుక్రవారం కోర్టులో హాజరుపరిచే అవకాశాలు ఉన్నాయి.
