హైదరాబాద్, వెలుగు: నూతన విస్తృత బీమా పథకం మార్గదర్శకాలు పూర్తిస్థాయిలో అమల్లోకి వచ్చే వరకు, ప్రస్తుతం చనిపోతున్న రైతుల కుటుంబాలకు పాత ఒప్పందం లేదా తాత్కాలిక ఏర్పాట్ల ద్వారా పరిహార చెల్లింపులు కొనసాగించాలని రైతు రక్షణ సమితి విజ్ఞప్తి చేసింది. మరణించిన రైతుల కుటుంబాలకు అందాల్సిన రూ.5లక్షల బీమా పరిహారాన్ని అందేలా చూడాలని సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
రైతు కుటుంబాలకు బీమా సాయం అత్యవసరమైనదని, కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్న పేద రైతు కుటుంబాలకు ఈ మొత్తం ఆర్థికంగా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏ ఒక్క రైతు కుటుంబానికి కూడా అన్యాయం జరగకుండా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పష్టమైన మార్గదర్శకాలు లేదా ఆదేశాలు జారీ చేయాలని ఆయన ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
