నాలుగేండ్లలో 3 లక్షల ఉద్యోగాలిస్తం

నాలుగేండ్లలో 3 లక్షల ఉద్యోగాలిస్తం

ఎలక్ట్రానిక్స్​, విద్యుత్​ వాహన రంగాల్లో ఉపాధి కల్పిస్తం: కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ఎల​క్ట్రానిక్స్, విద్యుత్​ వాహన రంగాల్లో సుమారు రూ.70 వేల కోట్ల పెట్టుబడులను తీసుకొచ్చి.. వచ్చే నాలుగేళ్లలో 3 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు. అసెంబ్లీలో శనివారం ఎలక్ట్రానిక్​ రంగ పరిశ్రమలపై ఎమ్మెల్యేలు పట్నం నరేందర్​ రెడ్డి, మెతుకు ఆనంద్, మహేశ్ రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేటీఆర్​ జవాబిచ్చారు. గత ఆరేళ్లలో ఎలక్ట్రానిక్స్​ ఇండస్ట్రీలో రూ.23 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దాంతో కొత్తగా 1,60,000 జాబ్స్ సృష్టించుకున్నామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఈ రంగంలో కేవలం 50 వేల ఉద్యోగాలు మాత్రమే ఉండేవని చెప్పారు. గడిచిన ఏడాదిలోనే కొత్తగా 40 కంపెనీలు వచ్చాయన్నారు. ఎలక్ట్రానిక్స్​ తయారీ రంగంలో రూ.2కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకు క్యాపిటల్ సబ్సిడీ ఇస్తున్నామని, ఐటీ రంగంలో 16 పాలసీలు, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామని పేర్కొన్నారు. తెలంగాణ అకాడమీ ఫర్​ స్కిల్​ అండ్ నాలెడ్జ్ ద్వారా 60 వేల మంది లోకల్ యువతకు ఎలక్ట్రానిక్​ సిస్టం డిజైనింగ్ మాన్యుఫాక్చరింగ్(ఈఎస్​డీఎం) ట్రైనింగ్ ఇచ్చామని, వారిలో 30 వేల మందికి ఇదే రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించామని వెల్లడించారు.