డ్రగ్స్ తో సంబంధం లేదు.. నా శాంపిల్స్ టెస్ట్ కి ఇస్తా

డ్రగ్స్ తో సంబంధం లేదు.. నా శాంపిల్స్ టెస్ట్ కి ఇస్తా

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచినా... ఓడినా ఏమీ తలకిందులు కాదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. హుజూరాబాద్ కు అంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈటల జానారెడ్డి అంత పెద్దోడు కాదని... మంచి మెజారిటీతో టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పారు. మీడియాతో చిట్ చాట్ చేసిన కేటీఆర్... మార్కెట్ లో తాను ఉన్నా అని చెప్పుకునేందుకే బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్నాడన్నారు. హుజూరాబాద్ లో కాంగ్రెస్ కు డిపాజిట్ కూడా రాదన్నారు. కరీంనగర్ లో బండి సంజయ్ కు ఓట్లేసిన వాళ్లు బాధపడుతున్నారన్నారు. గజ్వెల్ కాకుంటే ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చని... ఎవరొద్దన్నారని కేటీఆర్ ప్రశ్నించారు. పీసీసీ పదవి అమ్ముకున్నారని కాంగ్రెస్ నేతలే అంటున్నారని... టికెట్ల రేట్లు పెంచి అమ్ముకునేందుకే ఇలాంటి సభలు పెడుతున్నారని విమర్శించారు. గజ్వేల్ లో ప్రతాప్ రెడ్డి అంతకంటే పెద్ద సభ పెట్టారని ఏమైందని ప్రశ్నించారు. 

MIM కు బీజేపీనే భయపడుతోందని... తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ ఉందా..? సంఘ్ ఉందా అని ప్రశ్నించారు. సాయుధ పోరాటంలో పాల్గొన్నవాళ్లకు పెన్షన్ ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు కేటీఆర్. కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీలకు కేసీఆర్ ను తిట్టడం తప్ప... బీజేపీ, కాంగ్రెస్ లు కనబడడంలేదన్నారు. YS షర్మిల కూడా కేవలం కేసీఆర్ ను టార్గెట్ చేస్తున్నారన్నారు. తెలంగాణను ఫెయిల్యూర్ స్టేట్ గా చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం సెక్రటేరియట్ రానంత మాత్రానా... సంక్షేమ పథకాలు ఆగాయా అని ప్రశ్నించారు. ఆయన ఫాం హౌస్ లో పడుకుంటేనే ఇంత అభివృద్ధి జరుగుతోందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పుడు పీసీసీ పదవి కొనుక్కోడు... రేపు ఎమ్మెల్యేల టికెట్లు అమ్ముకుంటాడని కేటీఆర్ చెప్పారు. జూన్ 2 తెలంగాణకు అసలైన విమోచన దినం అని కేటీఆర్ చెప్పారు. సీఎంను తాగుబోతు అన్నోడు మనిషేనా... వాడు చిల్లరగాడు అంటూ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అవసరమైతే రాజద్రోహం కేసు పెడతామన్నారు. ఏ ఒక్కడిని వదలబోమని... అందరి భాగోతాలు తమ దగ్గర ఉన్నాయని... ఒక్కొక్కడి బట్టలూడదీస్తామన్నారు కేటీఆర్. డ్రగ్స్ తో తనకేమీ సంబంధం లేదని... కావాలంటే తన బ్లడ్, వెంట్రుకల శాంపిల్స్ ఇస్తానని టెస్ట్ చేయించుకోవచ్చన్నారు కేటీఆర్.