అంతకుముందు అసెంబ్లీలోనూ చర్చలు
టీఆర్ఎస్లో ప్రకంపనలు సృష్టించిన ఈటల కామెంట్లు
మంత్రి ఈటల రాజేందర్ ఆదివారం చేసిన కామెంట్ల నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆయనతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అసెంబ్లీ నుంచి ఈటలను తన కారులో ప్రగతిభవన్కు తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరూ మధ్యాహ్న భోజనం చేసి చాలా సేపు మాట్లాడుకున్నారు. ఈటల రాజేందర్ ఆదివారం తన నియోజకవర్గం హుజూరాబాద్ లోని వీణవంకలో మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి, పింఛన్లతో పేదరికం పోదని, పరిగె ఏరుకుంటే పంట పండించినట్లు కాదని కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టేలా ఉండటంతో టీఆర్ఎస్ నేతలు కలవరపడ్డారు. ఈటల కామెంట్లపైనే సోమవారం అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలు చర్చించుకోవడం కనిపించింది. గులాబీ జెండా ఓనర్లం తామేనని గతంలో ఆయన చేసిన ప్రకటనను కూడా వారు గుర్తుచేసుకున్నారు.
మండలి నుంచి అసెంబ్లీకి వచ్చి..
సోమవారం మండలిలో క్వశ్చన్ అవర్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో నేరుగా అసెంబ్లీకి వచ్చి అక్కడ సభలో ఉన్న ఈటల రాజేందర్ను పలకరించారు. తర్వాత బయటికి రమ్మని కోరారు. ఇద్దరూ ముందుగా ఇన్నర్ లాబీల్లో దాదాపు అరగంట సేపు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి కేటీఆర్ కారులో ప్రగతిభవన్ కు వెళ్లారు. సుమారు గంటన్నర పాటు ప్రగతిభవన్లో ఈటల గడిపారు. అక్కడే ఈటల, కేటీఆర్ కలిసి భోజనం చేశారు.
ఈటల నో కామెంట్
ప్రగతిభవన్కు వెళ్లిన విషయంపై ఈటల రాజేందర్ వద్ద ప్రస్తావిస్తే.. ‘‘ఆ ఒక్క విషయం తప్ప ఏం అడిగినా చెపుతా..’’ అని అన్నారు.
ఈటల రాజేందర్ తో కలిసి కేటీఆర్ సమావేశం కావడం వెనుక సీఎం కేసీఆర్ ఆదేశాలు ఉన్నట్టు టీఆర్ఎస్ లీడర్ల మధ్య చర్చ జరుగుతోంది. గతంలో ‘గులాబీ జెండా ఓనర్లం మేమే’ అని ఈటల మాట్లాడినప్పుడు కూడా ఆయనతో కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్ నందినగర్లో ఉన్న కేసీఆర్ ఇంటికి ఈటలను పిలుచుకుని దాదాపు నాలుగు గంటల పాటు కేటీఆర్ చర్చించారు. అప్పుడు కేసీఆర్ ఆదేశాల మేరకే ఈటలతో కేటీఆర్ భేటీ అయ్యారని, ఇప్పుడు సమావేశం అవడం వెనుక కూడా కేసీఆర్ డైరెక్షన్ ఉండొచ్చని లీడర్లు భావిస్తున్నారు.
తెలంగాణ భవన్ నుంచి ప్రగతిభవన్ వరకు
గత నెల తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ మీటింగ్ లో కేసీఆర్ కీలక కామెంట్లు చేశారు.‘‘ పార్టీ పెట్టినోళ్లు ఎవరూ సక్సెస్ కాలే. అంత ఈజీ కాదు. ఎంతో శ్రమ కావాలి. నరేంద్ర, విజయశాంతి, దేవేందర్ గౌడ్ పార్టీలు పెట్టినా మట్టిలో కలిసి పోలేదా?’’ అని అన్నారు. ఈ కామెంట్లు ఈటలను దృష్టిలో పెట్టుకుని చేసినట్లు టీఆర్ఎస్ లీడర్ల మధ్య చర్చకు దారితీసింది. ఆ తర్వాత నుంచి ఈటలకు, ప్రగతిభవన్ కు దూరం పెరిగినట్లు లీడర్లు చెప్తున్నారు. వారం రోజుల కింద సీఎం కేసీఆర్ మంత్రులతో భేటీ అయినప్పుడు అందుబాటులో ఉన్న మంత్రి ఈటలను పిలువలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలను కూడా ఆయనకు అప్పగించలేదు. కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్ కు బాధ్యతలు ఇచ్చి, అదే జిల్లాకు చెందిన ఈటలకు ఇవ్వకపోవడం వంటి పరిణామాలు టీఆర్ఎస్ లీడర్లలో చర్చకు కారణమయ్యాయి. ఇలాంటి కొన్ని ఘటనల వల్ల ఈటల మనస్తాపం చెందారని, అందుకే తన నియోజకవర్గంలో సంచలన కామెంట్లు చేశారని లీడర్లు అంటున్నారు.