మహిళా ఎంపీతో థ‌రూర్ చిట్‌చాట్.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్‌

మహిళా ఎంపీతో థ‌రూర్ చిట్‌చాట్.. సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్‌

న్యూఢిల్లీ: పొలిటీషియన్స్ ఎక్కడున్నా, ఏం చేస్తున్నా వారిపై కెమెరాలు ఫోకస్ పెడుతుంటాయి. ముఖ్యంగా చట్టసభల్లో ఉన్నప్పుడు ఫోకస్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. సభ జరుగుతుండగా కొందరు నేతలు నిద్రపోవడం లాంటివి చూస్తునే ఉంటాం. తాజాగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ అలాంటి ఓ ఘటనతో సోషల్‌ మీడియా ట్రెండింగ్‌లో నిలిచారు. లోక్‌సభలో ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో ఆయన మాట్లాడటమే ఇందుకు కారణం. దీనిపై సోష‌ల్‌మీడియాలో స‌ర‌దా మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అసలేం జరిగిందంటే.. రష్యా–ఉక్రెయిన్‌ వార్ పై సభలో జమ్మూ క‌శ్మీర్ మాజీ సీఎం ఫ‌రూక్ అబ్దుల్లా మాట్లాడుతుండగా.. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలేతో థరూర్‌ మాట్లాడుతూ కనిపించారు. ముందుసీటులో ఆమె కూర్చొని ఉండగా.. థరూర్‌ వెనుక సీట్‌లో బల్లపై తల ఆనించి పడుకుని ముచ్చటించారు. ఓవైపు ఫరూక్‌ అబ్దుల్లా సీరియస్‌గా ప్రసంగిస్తుండగా.. మరోవైపు థరూర్‌ ఫన్నీగా ఆమెతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో నెట్ లో చక్కర్లు కొడుతోంది.

ఈ ఘటనపై శశి థరూర్ స్పందించారు. ఫరూక్ అబ్దుల్లా తర్వాత సుప్రియా మాట్లాడాల్సి ఉందని.. దీంతో పాలసీకి సంబంధించిన ప్రశ్నల్ని అడిగేందుకే ఆమె తనతో మాట్లాడారన్నారు. అలాగే ఫరూక్ అబ్దుల్లా ప్రసంగానికి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఆమె నెమ్మదిగా మాట్లాడారని థరూర్ ట్వీట్ చేశారు. దీంతో ఆమె మాటల్ని వినేందుకు.. బల్లపై తలను ఆనించాల్సి వచ్చిందన్నారు. మరో ట్వీట్ లో వెటరన్ యాక్టర్లు రాజేశ్ ఖన్నా, షర్మిలా ఠాగూర్ నటించిన అమర్ ప్రేమ్ సినిమాలోని ‘కుచ్ తో లోగ్ కహేంగే, లోగోన్ కా కామ్ హీ కెహ్నా’ (ఎవరో ఏదోటి అంటుంటారు.. వారి పనే ఏదోటి అంటూండటం) అనే పాట లిరిక్స్ ను ఆయన షేర్ చేశారు. ఈ ట్వీట్ కు సుప్రియా సూలేను ట్యాగ్ చేశారు. 

మరిన్ని వార్తల కోసం:

అమ్మో నిమ్మా! భారీగా పెరిగిన ధరలు

కోహ్లీ, కుంబ్లే గొడవపై నోరు విప్పిన వినోద్ రాయ్