సీఎం గద్వాల సభలో కూచుకుళ్ల ప్రత్యక్షం

సీఎం గద్వాల సభలో కూచుకుళ్ల ప్రత్యక్షం

నాగర్​ కర్నూల్ , వెలుగు:   కాంగ్రెస్​లో  చేరడానికి అంతా రెడీ చేసుకున్న ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్​ రెడ్డి సోమవారం గద్వాలలో జరిగిన సీఎం కేసీఆర్​ మీటింగ్​లో  ప్రత్యక్షమయ్యారు.  బీఆర్​ఎస్​లో ఉంటూ కాంగ్రెస్​లో చేరేందుకు సిద్ధమైన కూచుకుళ్ల సీఎం సభలో కనిపించి మరింత సస్పెన్స్​ క్రియేట్ చేస్తున్నారు.  రాబోయే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​ రెడ్డికి సపోర్ట్​ చేయనని కాంగ్రెస్​ కీలక నేతలతో వరుసగా భేటీ అయిన కూచుకుళ్ల ఆ పార్టీ​లో  చేరేందుకు డేట్​ ఫిక్స్​ చేసుకున్నారనే వార్తలొచ్చాయి.

 ఓపెన్​గా  కాంగ్రెస్ నేతలను కలిసిన తర్వాత దాచిపెట్టదానికి ఏం లేదని స్పష్టం చేసిన దామోదర్​ రెడ్డి కొడుకు  డా. రాజేశ్​ రెడ్డి పార్టీలో ఎప్పుడు చేరేది త్వరలోనే  క్లియర్​ అవుతుందని కూడా చెప్పారు.  కాంగ్రెస్​లో  కూచుకుళ్ల  చేరికపై తేదీల గురించి చర్చ జరుగుతున్న  టైంలో  గద్వాల సీఎం సభలో  కనిపించడంపై అటు బీఆర్​ఎస్​, ఇటు కాంగ్రెస్​లోనూ చర్చ నడుస్తోంది.  గద్వాల స్టేజీ దిగిన తర్వాత మీడియాతో చిట్​చాట్​ చేసిన కూచుకుళ్ల ''పరిస్థితులు బాగాలేవు. ఏమవుతుందో అర్థం కావడం లేదు. ప్రస్తుతం తాడు మీద నడుస్తున్న అని కామెంట్​ చేశారు''.