రాజీ కుదిరింది..కలిసి పనిచేసేందుకు అంగీకారం

రాజీ కుదిరింది..కలిసి పనిచేసేందుకు అంగీకారం

యాదాద్రి, వెలుగు : భువనగిరి కాంగ్రెస్​లో రాజీ కుదిరింది. అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, పంజాల రామాంజనేయులు కలిసిపోయారు. వీరిద్దరి మధ్య జడ్పీ మాజీ చైర్మన్​ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీ కుదిర్చినట్లు తెలిసింది.  భువనగిరి కాంగ్రెస్​సీటును బీసీలకు కేటాయించాలన్న డిమాండ్​ గత ఎన్నికల నుంచి కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో అది మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నది. ఈ మేరకు  పోత్నక్​ ప్రమోద్​కుమార్​, రామాంజనేయులు సహా మరికొందరు లీడర్లు ఢిల్లీకి పలుమార్లు పర్యటనలు చేశారు. అయినాహైకమాండ్ బీఆర్ఎస్​నుంచి తిరిగి కాంగ్రెస్​లో చేరిన కుంభం అనిల్​రెడ్డికే  టికెట్​ ఇచ్చింది.

దీంతో  పోత్నక్​, రామాజంనేయులు కలిసి హైదరాబాద్​లో సీక్రెట్​మీటింగ్​ పెట్టి కుంభంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఇండిపెండెంట్‌‌‌‌‌‌‌‌గా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించారు.  వివాదం ముదురుతుండడంతో జడ్పీ మాజీ చైర్మన్​ కసిరెడ్డి నారాయణ రెడ్డి సహా కాంగ్రెస్​ ముఖ్య లీడర్లు రంగంలోకి దిగి కుంభం, రామాంజనేయులు మధ్య రాజీ కదిర్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ముందుగా అభ్మర్థి కుంభంతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఆయన వివాదానికి తెర దించడానికి ఆయన  సుమఖత వ్యక్తం చేశారు.

అనంతరం కుంభంను వెంట బెట్టుకొని బీబీనగర్​లోని రామాంజనేయులు ఇంటికి ఆదివారం రాత్రి కసిరెడ్డి నారాయణరెడ్డి చేరుకున్నారు. ఇద్దరి మధ్య రాజీ కుదిరే విధంగా చర్చలు జరిపినట్టుగా తెలిసింది.  లోక్​సభ స్థానంలో రెండు సీట్లు బీసీలకు ఇస్తారని చెప్పడంతో తాను పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని రామాంజనేయులు చెప్పారని సమాచారం. అయితే కుభంకు టికెట్ హైకమాండ్ నిర్ణయమని,  పార్టీలో మరింత ప్రాధాన్యం ఇస్తామని చెప్పడంతో రామాంజనేయులు  రాజీకి అంగీకరించినట్టుగా తెలిసింది. 

థాక్రేను కలిసిన కుంభం, రామాంజనేయులు

చర్చలు విజయవంతం కావడంతో పార్టీ అభ్యర్థి కుంభం అనిల్​కుమార్​ రెడ్డి, రామాంజనేయులు కలిసి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి ఇంటికి వెళ్లారు. అక్కడే ఉన్న కాంగ్రెస్​ స్టేట్​ ఇన్​చార్జ్​ మాణిక్​ రావ్​ థాక్రేను కలిశారు.