
- రాజన్న సిరిసిల్ల జిల్లా
- తంగళ్ళపల్లిలో ఘటన
తంగళ్ళపల్లి, వెలుగు : ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన వేల్పుల బలరాం తన తమ్ముళ్లు కృష్ణ, బాలకిషన్ తో కలిసి పదిహేనేండ్ల కింద గ్రామ శివారులోని సర్వే నం.586/6/1లో 7 ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అందులోంచి 1.10 ఎకరాలు రోడ్డు కింద పోయింది. మిగతా భూమిని ముగ్గురు అన్నదమ్ములు సమానంగా పంచుకున్నారు. ఐదేండ్ల కింద బలరాం చనిపోయాడు.
దీంతో అతని భూమిని తమ్ముడు వేల్పుల కృష్ణ కబ్జా చేసేందుకు కొద్దిరోజుల కింట ప్రైవేట్ సర్వేయర్ తో తనకు అనుకూలంగా హద్దులను మార్చుకొని కడీలు పాతాడు. బలరాం భార్య సత్తవ్వ20 రోజులుగా భూమిలోకి వెళ్లేందుకు యత్నిస్తుండగా అడ్డుపడుతున్నాడు. అతడిని ఆమె నిలదీయడంతో చంపుతానని కృష్ణ బెదిరించాడు.
దీంతో పోలీసులకు సత్తవ్వ ఫిర్యాదు చేయడంతో కృష్ణపై కేసు నమోదు చేశారు. కేసు కొట్టేయాలని అతడు పోలీసులపై ఒత్తిడి తెచ్చేందుకు ఆదివారం స్టేషన్ కు వచ్చి పురుగుల మందు తాగేందుకు యత్నించినట్టు ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. కృష్ణ నేర చరిత్ర కలిగిన వ్యక్తి అని, 2014లో తన అన్న కొడుకు రవిపై హత్యాయత్నం చేయగా అప్పటి సిరిసిల్ల పోలీసులు కేసు నమోదు చేయగా.. నిందితుడికి కోర్టు ఏడేండ్లు జైలు శిక్ష విధించిందని పేర్కొన్నారు.
ఎస్ఐపై కావాలనే కుట్ర..?
తమ భూమిలో కృష్ణ అక్రమంగా కడీలు పాతాడని పోలీసులకు ఫిర్యాదు చేయగా, తంగళ్లపల్లి ఎస్ఐ విచారించి కేసు నమోదు చేశారని సత్తవ్వ తెలిపారు. ఎస్ఐపై కక్షగట్టి పోలీస్ స్టేషన్ కు వచ్చి అతడు పురుగుల మందు తాగినట్లు నటించి డ్రామా ఆడినట్లు ఆరోపించారు. ఎస్ఐని బెదిరించడం దుర్మార్గమని, తమకు న్యాయం ఎక్కడ దొరుకుతుందో తెలియడం లేదని బాధితురాలు సత్తవ్వ వాపోయింది .