
- ఏమైనా అనుమానాలుంటే సీసీఎల్ఏ నుంచి క్లారిటీ
- ఇప్పటికే భూ భారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థ.. త్వరలోనే ట్రిబ్యునళ్ల ఏర్పాటు
- జిల్లాస్థాయిలోనే అసైన్డ్ భూ సమస్యలు క్లియర్
- గైడ్లైన్స్ రిలీజ్ చేయనున్న సర్కారు
- కలెక్టర్ల ఆధ్వర్యంలో అసైన్డ్ కమిటీలు
- రెవెన్యూ సదస్సుల్లో 5 లక్షలు దాటిన అప్లికేషన్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భూ సమస్యలన్నింటినీ కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే భూ భారతి చట్టం తీసుకువచ్చి బాధ్యతలను క్షేత్రస్థాయిలో ఆర్డీవో, ఎమ్మార్వోలకు అప్పగించిన సర్కారు.. సీసీఎల్ఏ పాత్రను మరింత పరిమితం చేయాలని ఆలోచిస్తున్నది. రైతులు భూ సమస్యలతో సీసీఎల్ఏ దాకా రాకుండా కింది లెవెల్లోనే పూర్తి చేసేలా చూస్తున్నది. గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో రకరకాల భూ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి.
ఇందులో ఏదైనా సమస్య పరిష్కరించేందుకు క్లారిటీ లేకపోతే.. వాటికి సీసీఎల్ఏ నుంచి స్పష్టత ఇవ్వనుంది. ఇందుకోసం ఇప్పటికే భూ భారతి మార్గదర్శకాలతో పాటు అందుబాటులో ఉన్న అనేక భూ చట్టాలను రెఫర్ చేయనున్నది.
కలెక్టర్లకే పూర్తి అధికారాలు
అసైన్డ్ భూముల సమస్యలు సైతం జిల్లాస్థాయిలోనే పరిష్కారం కానున్నాయి. కలెక్టర్లకే పూర్తి అధికారాలు కట్టబెట్టడంతోపాటు అప్పీళ్ల వ్యవస్థను పటిష్టపరిచి, త్వరలోనే ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కలెక్టర్ స్థాయిలోనే 99 శాతం భూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసింది.
స్పష్టత లేని, తప్పనిసరి ఏదైనా అంశాలపై సీసీఎల్ఏ నుంచి క్లారిటీ ఇవ్వనుంది. రివిజన్ అథారిటీగా సీసీఎల్ఏ స్వయంగా లేదా దరఖాస్తు ఆధారంగా రికార్డ్ ఆఫ్ రైట్స్ ఎంట్రీలను సమీక్షిస్తారు. అధికారం దుర్వినియోగం, చట్టవిరుద్ధ నిర్ణయాలను సవరించి, స్పీకింగ్ ఆర్డర్ జారీ చేసే అధికారం సీసీఎల్ఏకు ఉంటుంది. ఇక జిల్లాస్థాయిలోనే అసైన్డ్ భూముల సమస్యలను పరిష్కరించేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో అసైన్డ్ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు.
దీనికి సంబంధించి ప్రభుత్వం త్వరలోనే గైడ్లైన్స్ రిలీజ్ చేయనున్నది. ఇది పేదలకు, అసైన్డ్ భూముల సాగుదారులకు ఎంతో ఊరటనివ్వనున్నది. ఇక ఎంతోకాలంగా కబ్జాలో ఉండి భూములు సాగు చేసుకుంటున్నప్పటికీ.. పట్టాలు లేకపోవడం, సర్వే నెంబర్ ఒకటి కబ్జాలో మరొక చోట ఉండటం వంటి వాటిని కూడా పరిష్కరించనున్నది.
త్వరలోనే ల్యాండ్ ట్రిబ్యునళ్లు
త్వరలోనే ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కాని అంశాలు, న్యాయం జరగలేదని ఎవరైనా రైతులు భావిస్తే ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించే వెసులుబాటు ఉన్నది. అయితే, ఇప్పుడు రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న సమస్యల ఆధారంగా ఎక్కడ ఎన్ని ల్యాండ్ ట్రిబ్యునళ్లు అవసరం? జిల్లాకు ఒకటి వేయడమా? లేక మూడు, నాలుగు జిల్లాలకు ఒక ల్యాండ్ ట్రిబ్యునళ్లు పెట్టడమా? అనేదానిపై తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది.
వాస్తవానికి గతంలో ఆర్వోఆర్-2020లో అప్పీళ్ల వ్యవస్థ లేకపోవడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ చిన్న సమస్య రిజెక్ట్ అయినా సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. లాయర్లకు ఫీజులు చెల్లించలేక, కోర్టుల్లో నెలలు, ఏళ్ల తరబడి వేచి చూడలేక రైతులు నానా అవస్థలు పడ్డారు. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం భూ భారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థను పటిష్టం చేసింది. ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్లు ఏర్పాటు చేయడంతో ఒక స్థాయిలో కాకపోయిన రెండో స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించనున్నది.
అంతేకాకుండా ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటును కూడా మార్గదర్శకాల్లో వెల్లడించారు. వీటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. అప్పీళ్ల వ్యవస్థలో భాగంగా, తహసీల్దార్ ఆర్డర్పై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)కు 30 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే, ఆర్డీవో ఆర్డర్పై జిల్లా కలెక్టర్కు 60 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. ఇది మొదటి అప్పీల్ కాగా, రెండో అప్పీల్లో ఆర్డీవో ఆర్డర్పై జిల్లా కలెక్టర్కు, కలెక్టర్ ఆర్డర్పై ల్యాండ్ ట్రిబ్యునల్కు 30 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. దీంతో సీసీఎల్ఏ వరకు రావాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి భూ భారతి చట్టంలో వికేంద్రీకరించిన అధికారాలతో కొన్ని పట్టాదారు పాసు పుస్తకాల్లో మార్పులకు సంబంధించిన మాడ్యూల్స్ అప్లికేషన్ సీసీఎల్ఏ వరకు రావాల్సిన అవసరం లేదు.
అయితే, ఇప్పటికీ సీసీఎల్ఏ వరకు ఆ అప్లికేషన్లు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ స్థాయిలో అప్రూవల్ అయిన దరఖాస్తులు సీసీఎల్ఏ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం లేదని, ఫలితంగా అప్లికేషన్ డిస్పోజ్ ఇంకా ఆలస్యం అవుతుందని అంటున్నారు. సీసీఎల్ఏకు ఆ ఆప్షన్ ఎందుకు ఇచ్చారనే దానిపై కారణాలు తెలియరాలేదు. ఇంతకు ముందు ఉన్న రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ ఆప్షన్ సూచించినట్లు తెలిసింది.
రెవెన్యూ సదస్సులకు భారీగా అప్లికేషన్స్
ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయనే విషయం స్పష్టమవుతున్నది. ఇప్పటికే భూ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు 5 లక్షలు దాటాయి. వచ్చే రెండు నెలల్లో వీటన్నింటిని పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఆగస్టు 15 గడువుగా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్లకు ఏయే భూ సమస్యకు క్లారిటీ అవసరమో స్పష్టం చేయనున్నారు. ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగనున్నాయి. అందులో వచ్చిన సమస్యలను కేటగిరీలవారీగా చేసి పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.
భూసమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేయాలి: మంత్రి పొంగులేటి
భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నింటికీ పరిష్కారం చూపాలని కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సూచించారు. కొత్తగా నియమితులైన సంగారెడ్డి కలెక్టర్ ప్రావీణ్య, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, హైదరాబా ద్ కలెక్టర్ హరిచందన, నిజామాబాద్ కలెక్టర్ వినయకృష్ణారెడ్డి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ స్పెష ల్ సెక్రటరీ రాజీవ్గాంధీ హనుమంతు మంగళ వారం సెక్రటేరియెట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభు త్వంలో భూములకు సంబంధించి రైతులు అనుభవించిన కష్టాలకు, బాధలకు విముక్తి కల్పించేలా భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న దరఖాస్తుల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేసి అర్హు లైన ప్రతి ఒక్కరికీ అందించాల్సిన బృహత్తర బాధ్యత కలెక్టర్లదేనని అన్నారు. ప్రజల ఆకాంక్షల కు తగ్గట్టుగా ప్రభుత్వం పనిచేస్తుందని, ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని సూచించారు.