
రాష్ట్రంలో భూ సమస్యలన్నింటినీ కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. త్వరలోనే ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేసేందుకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో పరిష్కారం కాని అంశాలు, న్యాయం జరగలేదని ఎవరైనా రైతులు భావిస్తే ల్యాండ్ ట్రిబ్యునళ్లను ఆశ్రయించే వెసులుబాటు ఉన్నది.
అయితే, ఇప్పుడు రెవెన్యూ సదస్సుల్లో వస్తున్న సమస్యల ఆధారంగా ఎక్కడ ఎన్ని ల్యాండ్ ట్రిబ్యునళ్లు అవసరం? జిల్లాకు ఒకటి వేయడమా? లేక మూడు, నాలుగు జిల్లాలకు ఒక ల్యాండ్ ట్రిబ్యునళ్లు పెట్టడమా? అనేదానిపై తుదినిర్ణయం తీసుకోవాల్సి ఉన్నది. వాస్తవానికి గతంలో ఆర్వోఆర్-2020లో అప్పీళ్ల వ్యవస్థ లేకపోవడం వల్ల సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ చిన్న సమస్య రిజెక్ట్ అయినా సివిల్ కోర్టులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. లాయర్లకు ఫీజులు చెల్లించలేక, కోర్టుల్లో నెలలు, ఏళ్ల తరబడి వేచి చూడలేక రైతులు నానా అవస్థలు పడ్డారు.
ఈ సమస్యకు పరిష్కారంగా ప్రభుత్వం భూ భారతి చట్టంలో అప్పీళ్ల వ్యవస్థను పటిష్టం చేసింది. ఆర్డీవో, కలెక్టర్ స్థాయిలో అప్పీళ్లు ఏర్పాటు చేయడంతో ఒక స్థాయిలో కాకపోయిన రెండో స్థాయిలో సమస్యకు పరిష్కారం లభించనున్నది. అంతేకాకుండా ల్యాండ్ ట్రిబ్యునళ్ల ఏర్పాటును కూడా మార్గదర్శకాల్లో వెల్లడించారు. వీటిని త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. అప్పీళ్ల వ్యవస్థలో భాగంగా, తహసీల్దార్ ఆర్డర్పై రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ (ఆర్డీవో)కు 30 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. అలాగే, ఆర్డీవో ఆర్డర్పై జిల్లా కలెక్టర్కు 60 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు.
ఇది మొదటి అప్పీల్ కాగా, రెండో అప్పీల్లో ఆర్డీవో ఆర్డర్పై జిల్లా కలెక్టర్కు, కలెక్టర్ ఆర్డర్పై ల్యాండ్ ట్రిబ్యునల్కు 30 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు. దీంతో సీసీఎల్ఏ వరకు రావాల్సిన అవసరం ఉండదు. వాస్తవానికి భూ భారతి చట్టంలో వికేంద్రీకరించిన అధికారాలతో కొన్ని పట్టాదారు పాసు పుస్తకాల్లో మార్పులకు సంబంధించిన మాడ్యూల్స్ అప్లికేషన్ సీసీఎల్ఏ వరకు రావాల్సిన అవసరం లేదు. అయితే, ఇప్పటికీ సీసీఎల్ఏ వరకు ఆ అప్లికేషన్లు వస్తున్నాయి. జిల్లా కలెక్టర్ స్థాయిలో అప్రూవల్ అయిన దరఖాస్తులు సీసీఎల్ఏ ఆమోదం తీసుకోవాల్సిన అవసరం
లేదని, ఫలితంగా అప్లికేషన్ డిస్పోజ్ ఇంకా ఆలస్యం అవుతుందని అంటున్నారు. సీసీఎల్ఏకు ఆ ఆప్షన్ ఎందుకు ఇచ్చారనే దానిపై కారణాలు తెలియరాలేదు. ఇంతకు ముందు ఉన్న రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ ఆప్షన్ సూచించినట్లు తెలిసింది.
రెవెన్యూ సదస్సులకు భారీగా అప్లికేషన్స్
ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు రైతుల నుంచి భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయనే విషయం స్పష్టమవుతున్నది. ఇప్పటికే భూ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు 5 లక్షలు దాటాయి. వచ్చే రెండు నెలల్లో వీటన్నింటిని పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఆగస్టు 15 గడువుగా పెట్టుకున్నది. ఇందులో భాగంగానే కలెక్టర్లకు ఏయే భూ సమస్యకు క్లారిటీ అవసరమో స్పష్టం చేయనున్నారు. ఈ నెల 20 వరకు రెవెన్యూ సదస్సులు కొనసాగనున్నాయి. అందులో వచ్చిన సమస్యలను కేటగిరీలవారీగా చేసి పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టత ఇవ్వనుంది.