
- లోపలి నుంచి నీళ్లతో పాటు కొట్టుకపోతున్న ఇసుక, మట్టి
- మీడియా కంట పడకుండా గుంతపై నల్లమట్టిపోసిన ఎల్ అండ్ టీ ప్రతినిధులు
- ఫౌండేషన్ పనులపై అన్నీ అనుమానాలే
- ఒక్కొక్కటిగా బయటపడుతున్న లోపాలు
జయశంకర్ భూపాలపల్లి/ మహదేవ్పూర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎల్ అండ్ టీ కాంట్రాక్ట్ సంస్థ శుక్రవారం రిపేర్ వర్క్స్ చేపట్టింది. బ్యారేజ్లో కుంగిన ఏడో బ్లాక్లోని పియర్ల గేట్లను తొలగించేందుకు వర్కర్లు పనిచేస్తున్నారు. బ్యారేజ్కి అమర్చిన మొత్తం 86 గేట్లలో 79 గేట్లను ఎత్తి ఉంచారు. కుంగిన ఏడో బ్లాక్లోని 15 నుంచి 21వ పియర్ల మధ్య గల 15వ గేటును ఇటీవల ఇంజినీర్లు పైకెత్తారు. మిగతా గేట్లను ఎత్తే పనిలో ఉన్నారు. పెద్ద పెద్ద ఇనుప నిచ్చెనల సహాయంలో గేట్లకు అమర్చిన బోల్టులను తొలగిస్తున్నారు. బ్యారేజ్ అప్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాక్లలో నిల్వ ఉన్న నీటిని మోటార్లతో ఎత్తిపోస్తున్నారు. డౌన్ స్ట్రీమ్ లో ఏర్పడిన ఇసుక మేటలను జేసీబీలతో తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ భారీ గుంత బయటపడడం గమనార్హం. కాగా, ఏడో బ్లాక్లో పియర్స్కు సమీపంలో బయటపడ్డ గుంత విషయంపై కాళేశ్వరం ప్రాజెక్ట్ ఈఈ తిరుపతి రావును వివరణ కోరగా అలాంటిదేమీ తన దృష్టికి రాలేదన్నారు. నల్లమట్టి పోసేది కూడా రోడ్డు కోసమే తప్ప గుంతను పూడ్చేందుకు కాదన్నారు. ఎన్డీఎస్ఏ సూచనలు, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బ్యారేజీ దగ్గర రిపేర్ వర్క్స్ చేపట్టినట్లు తిరుపతిరావు వెల్లడించారు.
ఫౌండేషన్ పనులపై అన్నీ అనుమానాలే
మేడిగడ్డ బ్యారేజీని ప్రారంభించిన నాలుగున్నరేండ్లకు అక్టోబర్ 21, 2023న భూమిలోకి కుంగింది. బ్లాక్ 7లో ఉన్న 19, 20, 21వ పియర్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. 19 పియర్ ఏకంగా ఐదు ఫీట్లకు పైగా కూరుకపోయింది. ఫౌండేషన్ కింది ఇసుక కొట్టుకుపోవడం వల్లే పియర్స్ భూమిలోకి కుంగా యని, ఈ లెక్కన బ్లాక్ 7 కింద భారీ గుంత ఏర్పడిందని ఇప్పటిదాకా ఇరిగేషన్ ఇంజినీర్లు చెప్తూ వచ్చారు. ఇది నిజమే అయినప్పటికీ శుక్రవారం భూమిపై భాగంలో పియర్ల పక్కన గుంత పడడం ఆశ్చర్యం కలిగించింది. ఇందులోంచి చూస్తే నీళ్లతో పాటే ఇసుక, మట్టి కొట్టుకు పోతున్న దృశ్యాలపై ఇంజినీరింగ్ నిపుణులు సైతం విస్తుపోతున్నారు. బ్యారేజీ నిర్మాణ సమయంలో చేసిన సిమెంట్కాంక్రీట్పనులు నాసిరకంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీలో 20, 21వ పిల్లర్ల పక్కన బయటపడ్డ గుంత మీడియా కంట పడకుండా ఎల్ అండ్ టీ ప్రతినిధులు నల్లమట్టి తీసుకొచ్చి పూడ్చే ప్రయత్నం చేశారు. ఇలా ఎందుకు చేశారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేదు. పలువురు ఇంజినీరింగ్ ఎక్స్పర్ట్స్ మాత్రం బ్యారేజీ నిర్మాణ సమయంలో భూఅంతర్భాగంలో పనులు అస్తవ్యస్తంగా చేయడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు.
మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్లోని 20, 21వ పిల్లర్ల దగ్గర శుక్రవారం ఉదయం బయటపడిన భారీ బొయ్యారం ఇది. ఒకటిన్నర మీటర్ల వెడల్పు, రెండు మీటర్ల పొడవు, సుమారు 6 ఫీట్ల లోతుతో బ్యారేజీ పియర్స్(పిల్లర్లు)కు అతి దగ్గరగా ఇది ఏర్పడింది. గోదావరిలో ఇప్పుడొస్తున్న కేవలం 2 వేల క్యూసెక్కుల వరద తాకిడికే పియర్ల కింది నుంచి ఇసుక, మట్టి కొట్టుకుపోతున్న దృశ్యం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. మొన్నటి దాకా ఇరిగేషన్ ఇంజినీర్లు పియర్స్ అడుగున ఇసుక కొట్టుకపోయి19వ పిల్లర్ భూమిలోకి కుంగినట్లు చెప్పారు. ఇప్పుడీ చిత్రాన్ని చూస్తే పియర్లకు అటూ ఇటూ ఇదే పరిస్థితి ఉన్నట్లు స్పష్టమవుతున్నది.