
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఢిల్లీలో జరిగిన ఈటీ ఇన్ఫ్రా రైల్ షో 2025లో ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్(ఎల్అండ్ టీ టీఎమ్ఆర్ హెచ్ ఎల్).. రైల్వే సేఫ్టీ ఎక్సలెన్స్ అవార్డును గెలుచుకుంది. ప్రయాణికుల భద్రతపై అసాధారణ దృష్టి, సమగ్ర రిస్క్ మేనేజ్మెంట్ పద్ధతులు, మెట్రో రైల్ కార్యకలాపాల్లో అధునాతన సాంకేతికతల అమలు కారణంగా ఈ అవార్డ్ దక్కింది. ఈ అవార్డును ది ఎకనామిక్ టైమ్స్.. సోమవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందజేసింది.ఈ సందర్భంగా ఎల్అండ్ టీ టీఎమ్ఆర్ హెచ్ ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ కేవీబీ రెడ్డి మాట్లాడుతూ..ఈ గుర్తింపు మా విజయాలను జరుపుకోవడమే కాదని, అర్బన్ మొబిలిటీ భవిష్యత్తును రూపొందించే బాధ్యతను గుర్తుచేస్తున్నదని తెలిపారు.
అర్బన్ రైల్, స్మార్ట్ స్టేషన్ల భవిష్యత్తు - అర్బన్ మొబిలిటీని మార్చడం” అనే అంశంపై జరిగిన ప్యానెల్ చర్చలో ఆయన పాల్గొన్నారు. అధునాతన టెక్నాలజీ వినియోగం, నిరంతర సేవా అభివృద్ధి, సమయ నిర్వహణ, భద్రతా చర్యల ద్వారా హైదరాబాద్ మెట్రో విజయాలను సాధిస్తోందని వివరించారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాల (పీపీపీ)లో ఎదురయ్యే సవాళ్లను హైలైట్ చేశారు. అనుమతులలో జాప్యం, ఆర్థిక అనిశ్చితులు వంటి సమస్యలను పరిష్కరించడానికి బలమైన విధానపరమైన మద్దతు, సమానమైన రిస్క్ షేరింగ్, ప్రభుత్వ-ప్రైవేట్ రంగాల మధ్య లోతైన సహకారం అవసరమని స్పష్టం చేశారు. ఈ అవార్డు హైదరాబాద్ మెట్రోను జాతీయ స్థాయిలో అర్బన్ మొబిలిటీలో ఒక బెంచ్మార్క్గా నిలబెట్టిందని కేవీబీ రెడ్డి పేర్కొన్నారు.