మంచులక్ష్మి, శ్రీరామ చంద్ర, అనన్య నాగళ్ల, హరితేజ, హేమ, సుప్రిత, శ్రద్ధాదాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లేచింది మహిళాలోకం’. అర్జున్, కార్తిక్ దర్శకత్వంలో హైమ రాజశేఖర్, శ్వేత మహి, నిరోష నవీన్ కలిసి నిర్మించారు. మార్చి 26న సినిమా విడుదల కానుంది. సోమవారం ట్రైలర్ను రిలీజ్ చేశారు.
కొత్తగా పెళ్లయిన ఒక జంట మధ్య చిన్న చిన్న విషయాలకే విభేదాలు రావడం.. వాటికి ఆజ్యం పోసేలా పక్కింటివాళ్లు మాట్లాడటం లాంటివి చూపిస్తూ ఎంటర్టైనింగ్గా సాగిన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్లో మంచు లక్ష్మి మాట్లాడుతూ ‘మేము చిన్న చినిమా చేసినా.. మంచి సినిమా చేశాం. నేను కామెడీ విషయంలో రెచ్చిపోయి చేశా. ఇంత మంచి మహిళలతో కలిసి సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆడవాళ్లు కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది. అందర్నీ నవ్విస్తుంది’ అని చెప్పారు. ఫస్ట్ టైమ్ కామెడీ మూవీ చేశానని అనన్య నాగళ్ల చెప్పింది. ప్రతి ఒక్కరినీ ఎంటర్టైన్ చేసే చిత్రమని నటులు హరితేజ, హేమ అన్నారు. అందరికీ రిలేట్ అయ్యే స్టోరీ ఇదని శ్రీరామ చంద్ర చెప్పాడు. ఇదొక ఫన్ రైడింగ్ ఫిల్మ్ అని దర్శక నిర్మాతలు చెప్పారు.
