స్వామి గౌడ్ సంచలన కామెంట్స్
దేశంలో కొన్ని కులాలే పరిపాలన, ప్రజాస్వామ్యాన్ని నడిపిస్తున్నాయని శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకరూప సిద్ధాంతాన్ని దేశంలో విస్తరింపజేయాలని కృషి చేసిన శ్రీ నారాయణ గురు ఆశయాలను.. బడుగు బలహీన వర్గాల ప్రజలు ముందుకు తీసుకెళ్లాలని ఆయన కోరారు. హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నారాయణ గురు జయంతి వేడుకల్లో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ తో కలిసి స్వామి గౌడ్ పాల్గొని నివాళులు అర్పించారు. వందేళ్ల క్రితం ఏర్పడ్డ కుల రక్కసి పునాదులే.. ఇప్పటికీ పరిపాలనను కొనసాగించడం… బలహీన వర్గాలపై జరుగుతున్న దాడికి నిదర్శనంగా ఆయన అభివర్ణించారు. కులం, మతం పక్కన పెట్టి… ఎవరికైతే తెలివితేటలు ఉంటాయో, ఎవరైతే పరిపాలన సాగించగలరో, ప్రజాస్వామ్యాన్ని కాపాడగలరో అలాంటి వ్యక్తులు ఏకమయ్యే రోజు త్వరలోనే రాబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కులరూప రక్కసి తన వికృత రూపాన్ని ప్రదర్శిస్తూ.. బడుగుబలహీన వర్గాలకు అన్యాయం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దేశానికి ఏకరూప సిద్ధాంతం అవసరమొచ్చిందని ఆయన అన్నారు. నారాయణ గురు స్పూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఐక్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు.
For More News…