తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి నడకమార్గంలో నరసింహ ఆలయంల ఏడవ మైలు రాయి వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అధికారులు తెలిపారు. ఈ చిరుతతో కలిపి మూడు నెలల వ్యవధిలోఐదు చిరుతలను అటవీశాఖ అధికారులు పట్టుకోవడం గమనార్హం. జూన్ 24, ఆగష్టు 14, ఆగష్టు 17, ఆగష్టు 28వ తేదీల్లో నాలుగు చిరుతలను అధికారులు పట్టుకున్నారు.
అలిపిరి తిరుమల మార్గంలో నాలుగు రోజుల క్రితమే ఈ చిరుత సంచరించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో చిరుతను బంధించేందుకు అధికారులు బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి ట్రాప్ లో చిక్కింది.
ఇటీవల కాలంలో అలిపిరి నడకమార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతిచెందింది. ఆ తర్వాత చిన్నారి కౌశిక్పై దాడి చేయడంతో టిటిడి, అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. భక్తుల భద్రత కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు చేపట్టారు. తిరుమల గిరుల్లో పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. తిరుమల గిరుల్లో ఆపరేషన్ చిరుత కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐదు చిరుతలను బంధించగా..మిగిలిన వాటి కోసం అన్వేషణ కొనసాగుతుంది.