శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్యకు సీఎం కేసీఆరే బాధ్యుడు
ఆయన రాజీనామా చేయాలె
బీజేపీ నేత వివేక్ డిమాండ్
కవితకు పట్టిన గతే కేసీఆర్కు పడుతుంది: ఎంపీ అర్వింద్
హైదరాబాద్, వెలుగు: ‘‘కార్మిక మంత్రిగా పనిచేశావ్.. ఎంప్లాయీస్ను డిస్మిస్ చేయాలంటే ప్రత్యేకంగా చట్టముందని తెలియదా’’ అని సీఎం కేసీఆర్ను బీజేపీ నేత, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. కార్మికులను డిస్మిస్ చేయడానికి ఉన్న నిబంధనలు ఏమిటో తెలియవా అని నిలదీశారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బీఎంఎస్ ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ యూనియన్ ఆఫీస్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘దుబయి నుంచి డ్రైవర్లను తీసుకువచ్చి ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు. ఆయన తీరును చూస్తే తుగ్లక్ గుర్తుకు వస్తున్నాడు. ఆయనకు పిచ్చిపట్టిందా అనే అనుమానం కలుగుతోంది” అని మండిపడ్డారు.
ఎయిరిండియా స్ట్రైక్ జరిగినపుడు అనుభవం లేని పైలెట్లతో విమానాలు నడిపి ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడారని, ఇప్పుడు టెంపరరీ ఆర్టీసీ డ్రైవర్లను పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్రెడ్డి ఆత్మహత్యకు సీఎం కేసీఆరే బాధ్యుడని ఆరోపించారు. కేసీఆర్ వ్యాఖ్యలతో మనస్తాపం చెంది డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారని, ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులంతా రోడ్లపై ఉంటే సీఎం ఆయన కుటుంబ సభ్యులతో దసరా సంబరాలు చేసుకున్నాడని విమర్శించారు. 19న జరిగే రాష్ర్ట బంద్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఇళ్ల ముందు ధర్నాలు చేయాలని పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబానికి
డబ్బు వ్యామోహం: అర్వింద్
కేసీఆర్ ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. తన కుటుంబం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని, కేసీఆర్ సర్కారు కూలినా బాధపడే వారు లేరన్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల్లో డబ్బు వ్యామోహం బాగా పెరిగిందన్నారు. నిజామాబాద్లో కవితకు పట్టిన గతే, రాష్ట్రంలో కేసీఆర్కు పడుతుందని హెచ్చరించారు.

