
TRS,MIM ల నుంచి విముక్త హైదరాబాద్ కోసం కృషి చేయడమే తమ లక్ష్యమన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. GHMC ఎన్నికలలో అత్యధిక సీట్లలో విజయం సాధించిన సందర్భంగా ఇవాళ(శుక్రవారం) గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, విజయం సాదించిన 46 మంది బీజేపీ కార్పొరేటర్లతో కలిసి ఆయన చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత అమ్మవారి సమక్షంలో పార్టీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి బీజేపీ కార్పొరేటర్లతో ప్రమాణం చేయించారు. ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూనే అభివృద్ధికి అన్ని విధాలా సహకరిస్తామని కార్పొరేటర్లు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడిన సంజయ్ … భాగ్యలక్ష్మీ అమ్మవారి పేరు కారణంగానే హైదరాబాద్కు భాగ్యనగరమని పేరొచ్చిందన్నారు. భాగ్యనగరాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు బీజేపీకి ఇచ్చారన్నారు. పాతబస్తీ ఎందుకు అభివృద్ధి చెందలేదో ప్రజలు ఆలోచించాలన్నారు. పాతబస్తీ బీజేపీ అడ్డా.. అభివృద్ది చేసి చూపుతామన్నారు. బీజేపీ ఏ మతానికి వ్యతిరేకం కాదని… తొందర తొందరగా GHMC ఎన్నికలు నిర్వహించిన కేసీఆర్.. మరి మేయర్ ఎన్నిక ఎందుకు నిర్వహించడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్ల కొనుగోలుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మా ఒక్క కార్పొరేటర్ను కెలికినా.. మేం వంద మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కెలుకుతామన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని తెలిపారు. ఇప్పటికైనా టీఆర్ఎస్ గుణపాఠం నేర్చుకోవాలి హెచ్చరించారు బండి సంజయ్.