- పెరిగిన ప్రీమియం కలెక్షన్
- త్వరలో సెబీ వద్దకు
- ఎల్ఐసీ ఐపీఓ ఫైనల్ పేపర్లు
న్యూఢిల్లీ: ఐపీఓకి వచ్చేందుకు రెడీగా ఉన్న ఎల్ఐసీ, డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్(క్యూ3) ను శుక్రవారం ప్రకటించింది. కంపెనీకి క్యూ3 లో రూ. 234.9 కోట్ల నికర లాభం రాగా, అంతకు ముందుటేడాది క్యూ3 లో వచ్చిన రూ. 90 లక్షలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ . కంపెనీకి కార్యకలాపాల ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ మాత్రమే పైన పేర్కొన్నారు. ఇన్వెస్ట్మెంట్ల ద్వారా వచ్చిన ప్రాఫిట్స్ ఇందులో కలిసి లేవు. ఎల్ఐసీకి డిసెంబర్ క్వార్టర్లో రూ. 97,761.20 కోట్లు ప్రీమియం కింద వచ్చాయి. అంతకు ముందు ఏడాది క్యూ3 లో ఈ నెంబర్ రూ. 97,008.05 కోట్లుగా ఉంది. ఎల్ఐసీకి వచ్చిన మొత్తం ప్రీమియం కలెక్షన్స్లో మొదటి ఏడాది ప్రీమియం కింద రూ. 8,748.55 కోట్లు వచ్చాయి. రెన్యువల్ ప్రీమియం కింద రూ. 56,822.49 కోట్లు అందాయి.
సెబీకి ఎల్ఐసీ ఐపీఓ ఫైనల్ పేపర్లు..
ఎల్ఐసీ ఐపీఓకి సంబంధించిన ఫైనల్ పేపర్లను త్వరలో సెబీ వద్ద ప్రభుత్వం ఫైల్ చేయనుంది. ఈ పేపర్లలో ఐపీఓలో షేరు ధర, పాలసీ హోల్డర్లకు, రిటైల్ బయ్యర్లకు ఇచ్చే డిస్కౌంట్స్, వివిధ కేటగిరీలకు ఎంత వాటాను కేటాయిస్తున్నారో అనే అంశాలు ఉంటాయి. ఉక్రెయిన్–రష్యా యుద్ధంతో ప్రస్తుతం మార్కెట్లో వోలటాలిటీ ఎక్కువగా ఉంది. దీంతో ఎల్ఐసీ ఐపీఓని తేవడానికి ప్రభుత్వం ఇంకోసారి ఆలోచిస్తోంది. ‘డీఆర్హెచ్పీకి ఇప్పటికే అనుమతులొచ్చాయి. ఫైనల్ పేపర్లను ఇక ఫైల్ చేయాల్సి ఉంది. ఇందులో ఐపీఓ ధర, అమ్మకానికి ఉండే షేర్లు వంటి డిటైల్స్ ఉంటాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తున్నాం. సరియైన టైమ్లో ఐపీఓకి సంబంధించి నిర్ణయం తీసుకుంటాం’ అని ప్రభుత్వ అధికారి ఒకరు చెప్పారు. కిందటి నెల 13 న డ్రాఫ్ట్ రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ (డీఆర్హెచ్పీ) ను ఎల్ఐసీ ఫైల్ చేసింది. ఈ వారం ప్రారంభంలో సెబీ అనుమతులొచ్చాయి. ఈ ఐపీఓ ద్వారా రూ. 60 వేల కోట్లను సేకరించాలని ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తం 31.6 కోట్ల షేర్లు లేదా 5 శాతం వాటాను ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సేల్ చేయనున్నారు.