దమ్మపేట, వెలుగు: జంట హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ మంగళవారం తీర్పు ఇచ్చారు. వివరాలిలా ఉన్నాయి.. దమ్మపేట మండలం మల్కారం గ్రామానికి చెందిన సుబ్బలక్ష్మి(50), ఆకాశ్(7)ను ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఉండరాజవరం మండలం వలివేలు గ్రామానికి చెందిన మల్లవరపు శ్రీనివాసరావు 2022 జులై 7న హత్య చేశాడు.
మృతురాలి బంధువు గుడిమెట్ల పోచమ్మ కంప్లైంట్ మేరకు అప్పటి దమ్మపేట ఎస్సై కె.శ్రావణ్ కుమార్ కేసు నమోదు చేయగా, అప్పటి సీఐ బి.బాలకృష్ణ కేసు దర్యాప్తు చేశారు. సాక్షుల విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో మల్లవరపు శ్రీనివాసరావుకు జీవిత ఖైదు, రూ. వెయ్యి జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. ఈ కేసును పబ్లిక్ ప్రాసిక్యూటర్ పీవీడీ లక్ష్మి వాదించారు.
