లాక్ డౌన్ తో బ్లాక్ లో అధిక ధరలకు మద్యం

లాక్ డౌన్ తో బ్లాక్ లో అధిక ధరలకు మద్యం
  • లాక్ డౌన్ తో ధరలు పెంచి అమ్మకం..
  •  నామమాత్రంగా ఎక్సైజ్ ఆఫీసర్ల దాడులు

నిజామాబాద్ జిల్లాలో లాక్ డౌన్ ఆంక్షలు ఉన్నప్పటికీ మద్యం అక్రమ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. బ్లాక్ లో కావాల్సిన బ్రాండ్లు,అడిగినన్ని బాటిళ్లు దొరుకుతున్నాయి. కొందరు బ్లాక్ లో అధిక ధరలకు అమ్ముతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో 28రోజులుగా వైన్స్, బార్లు మూతపడ్డాయి. దీంతో చాలామంది మద్యం కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు బెల్టు షాపుల్లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నా రు. వారిలో మద్యం వ్యాపారంతో గతంలో సంబంధం లేని వారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారికి మద్యం వ్యాపారులు, ఉన్నత స్థాయి ఆఫీసర్లు,ప్రజాప్రతినిధు లుసహకరిస్తున్నట్లు సమాచారం.

ప్రోత్సహిస్తున్న ఆఫీసర్లు

జిల్లాలో వైన్స్ షాపుల నిర్వాహకుల ఆధ్వర్యంలో బెల్టు షాపులు యథేచ్ఛగా నడుస్తున్నాయి. ఎక్సైజ్ ఆఫీసర్లు బెల్టు షాపులు, అక్రమ అమ్మకాలను కావాలనే ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అక్రమ మద్యం దందా వెనుక పలువురు రాజకీయ నాయకులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆఫీసర్లు మొక్కుబడిగా దాడులతో సరిపెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి.

లిక్కర్ అడ్డాలపై చేసిన దాడులు

..ఈనెల 9న ధర్‍పల్లి మండలం రామడుగు కు చెందిన ఇద్దరు మద్యం అక్రమంగా తరలిస్తుండగా ఎక్సైజ్, ఎన్‍ఫోర్స్ మెంట్ ఆఫీసర్లు పట్టుకుని ధర్‍పల్లి పోలీసులకు అప్పగించారు. బోధన్ మండలంలో రెండు బెల్ట్ షాపులపై రైడ్ చేసి కొంత మద్యం స్వాధీనంచేసుకున్నారు.

..ఈనెల 13న ఆర్మూర్ మండలం సుర్బిర్యాల్ గ్రామంలో అక్రమ మద్యం తయారీ స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. మద్యం తయారీకి ఉపయోగిస్తున్న స్పిరిట్‍ను స్వాధీనం చేసుకున్నారు. …

..ఈ నెల15న నిజామాబాద్ ఎంఎస్ ఆర్బార్సెల్లార్ లో అక్రమంగా నిల్వచేసిన రూ.2.30లక్షల విలువైన మద్యం బాటిళ్ల ను ఎక్సైజ్, ఎన్‍ఫోర్స్ మెంట్ ఆఫీసర్లు పట్టుకున్నారు. ఈ కేసులో బార్ ఓనర్ సుధాకర్ రెడ్డి, ఆయన కొడుకు వినీత్ రెడ్డి ,మరోవ్యక్తి శ్రీనివాస్ గౌడ్‍పై కేసు నమోదైంది.

..ఈనెల 19న నిజామాబాద్ నుంచి వర్నికి రూ . 95వేల విలువైన మద్యాన్ని బొలెరోలో తరలిస్తుండగా పోలీసులు నవీపేట్ మండలం మల్కాపూర్ శివారులో పట్టుకున్నారు.వర్నికి చెందిన వేంకటేశ్వర్ రావు,ఆటోడ్రైవర్ రాకేష్ ను అరెస్ట్ చేశారు.

ఎక్సైజ్ ఆఫీసర్ల పర్మిషన్ తోనే…

లాక్డౌన్ ప్రకటించగానే ప్రభుత్వం మద్యం అమ్మకాలను నిషేధించింది. దీంతో ఎక్సైజ్ ఆఫీసర్లు అన్నివైన్ షాపుల్లో ఉన్న స్టాక్ వివరాలు నమోదు చేసుకుని సీల్ వేశారు. లాక్ డౌన్ లగించిన తర్వాతే ఆయా షాపుల సీల్ విప్పాల్సి ఉంటుంది.కానీ వైన్ షాపుల యజమానులు రాత్రి వేళల్లో  సీల్ వేస్తున్నారు. షాపులోని స్టాక్ ఓ చోట డంప్ చేస్తున్నారు. ఈ విషయంపై ఎక్సైజ్ ఆఫీసర్లకు ముందే సమాచారం ఇచ్చివారి పర్మిషన్తోనే చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎక్సైజ్ ఆఫీసర్లు అదే రాత్రి మళ్లీ సీల్ వేస్తున్నారు. ఇందుకు ముందే వారికి కనీసం రూ.లక్ష ముట్ట జెబుతున్నట్లు తెలుస్తోంది. రాత్రివేళ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు కనిపిస్తే ఇబ్బందులు లేకుండా వారికి కూడా అంతే అందజేస్తున్నారు. ఎక్సైజ్ ఆఫీసర్లకు మాత్రం స్టాక్ బట్టి ముడుపులు ముట్టజెపుతున్నారు. వ్యాపారులకు లోలోపల సహకరిస్తున్న ఆఫీసర్లు తమతో ముందస్తుగా ఒప్పందం చేసుకోకుండా వ్యాపారంచేస్తున్న వారిపై మొక్కుబడిగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నట్లు సమాచారం.