తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ రేట్లు తగ్గినయ్

తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ రేట్లు తగ్గినయ్

కోటర్​పై రూ.10 తగ్గిపు
సేల్స్​10% పెంచాలని సర్కార్ టార్గెట్​
బార్లలో కోటర్​, హాఫ్ బాటిల్స్ అమ్మేందుకూ ఓకే
బీర్ల రేట్లు మాత్రం యథాతథంగా కొనసాగింపు

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలో మందు రేట్లు తగ్గాయి. లిక్కర్ సేల్స్ పడిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ధరలను తగ్గించింది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(ఐఎంఎఫ్ఎల్), ఫారిన్ లిక్కర్(ఎఫ్ఎల్)పై ప్రస్తుతం ఉన్న స్పెషల్ ఎక్సైజ్ సెస్(ఎస్ఈసీ)ను తగ్గిస్తూ శుక్రవారం బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ సర్య్కూలర్​ను జారీ చేసింది. దీని ప్రకారం మద్యం ధరలు క్వార్టర్ మీద రూ.10, హాఫ్ మీద రూ.20, ఫుల్ బాటిల్ మీద రూ.40 తగ్గనున్నాయి. అలాగే లిక్కర్ సేల్స్ ను పెంచేలా అధికారులకు ప్రభుత్వం టార్గెట్ కూడా పెట్టింది. ఇందులో భాగంగా ఎక్సైజ్ సిబ్బందికి సంబంధించిన పెండింగ్ బిల్లులన్నింటినీ శాంక్షన్ చేసింది.

టార్గెట్ రీచ్ కాకుంటే చర్యలు!

 మందు అమ్మకాలపై అధికారులకు సర్కారు టార్గెట్ పెట్టింది. శుక్రవారం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్​లో మద్యం అమ్మకాలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తున్నది. ఈ నెల నుంచి మద్యం అమ్మకాల్లో 10 శాతం వృద్ధి చూపించాలని టార్గెట్ పెట్టినట్టు సమాచారం. టార్గెట్ అందుకోని అధికారులపై చర్యలు తీసుకుంటామని మీటింగ్​లో హెచ్చరించినట్టు కూడా తెలిసింది. బార్లు, వైన్ షాపులు వీలైనంత ఎక్కువ మద్యాన్ని అమ్మేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్టు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటిదాకా బార్లలో ఫుల్ బాటిల్స్ మాత్రమే అందుబాటులో ఉంటుండేవి. అంతకన్నా తక్కువ అయితే పెగ్గుల లెక్కన బార్లు అమ్ముతుండేవి.

అయితే, ఇప్పుడు బార్లలో కూడా ఏ సైజు బాటిల్ ను అయినా అమ్మేందుకు సర్కారు వీలు కల్పించింది. క్వార్టర్, హాఫ్, ఫుల్ బాటిళ్లను అమ్మేందుకు అనుమతించింది. వచ్చే ఏడాది నుంచి బార్లకు ఫార్మల్​ రెన్యువల్ కూడా ఉండబోదని చెప్పింది. కొత్త పాలసీకి సంబంధించి అన్ని వైన్ షాపులు, బార్ల ఓనర్లతో సమావేశాలు నిర్వహించాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. ధరలను తగ్గించడం వల్ల డ్యూటీ చెల్లించకుండా సరఫరా చేసే మద్యం (ఎన్​డీపీఎల్), కల్తీ మద్యం (ఐడీ) తగ్గే అవకాశం ఉందని సర్కారు భావిస్తున్నది.