
బెంగాల్లో బంకించంద్ర ఛటర్జీ పేరు ప్రతి ఇంట్లో తెలుసు. కానీ ఆయన జీవిత చరిత్ర గురించిన సమాచారం మాత్రం చాలా తక్కువగా దొరుకుతుంది. ఆయన జీవితంలోని తొలినాళ్ల చరిత్ర అసలే తెలియదు. ఆయన తండ్రి జాదవ్ చంద్ర ఛటర్జీ పర్షియన్ భాషా వేత్త. కానీ, ఆయన మారుతున్న కాలం సూచనలను గమనించి ఆంగ్ల భాషా అధ్యయనం చేపట్టాడు.
ఆయన తన సోదరుడు పనిచేస్తున్న కలకత్తాలోని ప్రభుత్వ సాల్ట్ – టాక్స్ కలెక్షన్ ఆఫీస్కు కటక్ నుంచి నడిచివెళ్లాడట. అక్కడ ఆయనకు అన్ని వసతులు కల్పించడంతో తన పనిని పట్టుదలతో కొనసాగించాడు.1836లో ఆయన మిడ్నాపూర్లో ట్రెజరర్గా నియమితుడయ్యాడు. 1838లో హుగ్లీ డిప్యూటీ కలెక్టర్ అయ్యాడు. ఆ ఏడాదే జూన్ 27న బంకించంద్ర ‘కాంతాల్ పారా’ అనే గ్రామంలో జన్మించాడు.
మిడ్నాపూర్లోని స్కూల్లో చదువు పూర్తి చేశాడు. 1857లో లండన్ నమూనాగా ఉండే కలకత్తా యూనివర్సిటీ స్థాపించబడింది. బంకింఆ కాలేజీలో నుంచి బి.ఎ. డిగ్రీ పొందాడు. ఆ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పొందిన మొదటి ఇద్దరు విద్యార్థుల్లో ఈయన ఒకరు. అదే ఏట బెంగాల్ ఎగ్జిక్యూటివ్ సర్వీస్కు, ఆగస్టులో జెస్సోర్ డిప్యూటీ మెజిస్ట్రేట్, డిప్యూటీ కలెక్టర్గా నియమితుడయ్యాడు.
33 ఏండ్ల ఉద్యోగ జీవితంలో రకరకాల పదవుల్లో అనుభవం పొంది, గొప్ప పరిపాలనాదక్షుడిగా పేరుగాంచాడు.1867లో సిబ్బంది వేతన సవరణ కమిటీకి సెక్రటరీ అయ్యారు. బెహ్రాంపూర్లో కొన్ని సైనిక దళాలు కర్నల్ డఫిక్ అనే యూరోపియన్ సైనికాధికారి ఆధీనంలో ఉండేవి. ఆ అధికారితో బంకించంద్రకు పొసగలేదు. దాంతో ఆయన వేసిన దావా
ప్రకంపనలు సృష్టించింది. ఆయనకు బెహ్రాంపూర్లోని ఒక సాహితీ సమాఖ్యతో సన్నిహిత సంబంధం ఉండేది. బెంగాలీ పీరియాడికల్ను తీసుకురావాలన్న ఆయన సంకల్పం ‘బంగదర్షన్’ ప్రచురణతో ఇక్కడ నెరవేరింది. 1882లో
ఒరిస్సాకు ఆయనను బదిలీ చేశారు.
ఆయన తన గ్రాడ్యుయేషన్కు ముందే తొలి రచనలు ‘సంబద్ – ప్రభాకర్’లో ప్రచురితమయ్యాయి. తర్వాత ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే బెంగాలీ వ్యాసాలు, గేయాలు, ఆంగ్ల కథలు రాశారు. డిప్యూటీ మెజిస్ట్రేట్గా ఉన్న టైంలో దుర్గేశ నందిని, కపాల కుండల నవలలు పబ్లిష్ అయ్యాయి. బెంగాలీ కాల్పనిక సాహిత్యంలో ఈయనది ఏకైక స్థానం.
ఈయన రచనలకు ముందు బెంగాలీ సాహిత్యంలో ఉన్నవన్నీ అనువాదాలే. ఆయన రచనలు పుస్తకంగా రాకముందే సీరియల్స్గా ప్రచురితమయ్యేవి. బెంగాలీ భాషను సుసంపన్నం చేసిన సాహితీ నిర్మాత ఆయన. బంకించంద్ర పేరు ‘వందే మాతరం’తో విడదీయలేనంతగా పెనవేసుకుపోయింది. ఆయన 53 ఏండ్ల వయసులో రిటైర్ అయ్యాడు.
అదే ఏట ప్రభుత్వం ‘రాయ్ బహదూర్’ అనే బిరుదు ప్రదానం చేసింది. 1894లో ఆయనను ‘కంపానియన్ ఆఫ్ ది మోస్ట్ ఎమినెంట్ ఆర్డర్ ఆఫ్ ద ఇండియన్ ఎంపైర్’గా చేశారు. అప్పటికే కొంతకాలం నుంచి ఆయన డయాబెటిస్తో బాధపడుతున్నాడు. అదే ఏట ఏప్రిల్ 8న 56 ఏండ్ల వయసులో కాలం చేశారు.
- మేకల
మదన్మోహన్ రావు
కవి, రచయిత