లోన్ తీసుకున్న మహిళ చనిపోతే బాకీ మొత్తం మాఫీ

లోన్ తీసుకున్న మహిళ చనిపోతే  బాకీ మొత్తం మాఫీ
  •      ప్రమాద బీమా మరో రూ.10 లక్షలు 
  •     పూర్తి ప్రీమియం చెల్లించనున్న రాష్ట్ర సర్కార్
  •     64.35 లక్షల మంది మహిళలకు లబ్ధి 
  •     గతంలో అభయహస్తం బీమాను  ఎత్తేసిన బీఆర్ఎస్ .

కరీంనగర్, వెలుగు : స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు ఆపన్న హస్తం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. మహిళా గ్రూపులో సభ్యురాలిగా ఉండి లోన్ తీసుకున్న మహిళ ఏదైనా కారణంతో చనిపోతే.. ఆ లోన్ మొత్తం మాఫీ అయ్యేలా వారి పేరిట బీమా చేయించాలని నిర్ణయించింది. మహిళలపై భారం పడకుండా ఈ ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించేందుకు ఇప్పటికే రూ.50.41 కోట్లు మంజూరు చేసింది. 

అంతేగాక, ఈ బీమా ప్రయోజనాలను ఈ ఏడాది మార్చి 14 నుంచే వినియోగించుకునే వెసులుబాటు కల్పించింది. బ్యాంకు లింకేజీ లోన్లతోపాటు స్త్రీనిధి లోన్లకు కూడా ఈ లోన్ బీమా వర్తించనుంది. క్షేత్ర స్థాయిలో బీమా క్లెయిమ్ చేసే విధానంపై ఇప్పటికే సెర్ప్, మెప్మా సిబ్బందికి  గైడ్ లైన్స్ అందాయి. 

64.35 లక్షల మంది మహిళలకు లబ్ధి 

రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) పరిధిలోని 4,30,358 స్వయం సహాయక సంఘాల్లో 46.46 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉండగా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) పరిధిలోని 1.78 లక్షల గ్రూపుల్లో కలిపి 17.89 లక్షల మంది సభ్యులున్నారు. వీరందరికి లోన్ బీమా/ప్రమాద బీమా/ స్త్రీనిధి సురక్ష బీమా వర్తించనుంది. ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు, చిరు వ్యాపారాలు నిర్వహించుకునేందుకు మహిళా గ్రూపులకు బ్యాంకులతోపాటు స్త్రీనిధి రుణాలు ఇస్తున్న విషయం తెలిసిందే. 

అయితే, ఈ రుణాలు తీసుకున్నవారిలో కొందరు మహిళలు ఏదైనా అనారోగ్యం లేదా ప్రమాదవశాత్తూ మరణించినప్పుడు.. వారి వాటా ధనం చెల్లించడం సమస్యగా మారుతోంది. గ్రూపుగా తీసుకున్న లోన్ ను గ్రూపుగానే చెల్లించాల్సి ఉంటుంది. మృతురాలి కుటుంబ సభ్యులు లోన్ కిస్తీ చెల్లించేందుకు ముందుకు రాకపోవడంతో గ్రూపులోని మిగతా సభ్యులపై ఆ భారం పడుతోంది. 

చనిపోయిన మహిళ వాటా ధనం తీసేసి..తమ లోన్ కిస్తీని చెల్లించేందుకు మిగతా సభ్యులు వెళ్తే బ్యాంకు ఆఫీసర్లు తీసుకోవడం లేదు. దీంతో గ్రూప్ మొత్తం కిస్తీలు చెల్లించడం ఆపేయడంతో ఆ గ్రూప్ ఎన్ పీఏ జాబితాలోకి వెళ్తోంది. ఈ సమస్య నుంచి మహిళలను బయటపడేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం లోన్ బీమా స్కీమ్​ను అమల్లోకి తెచ్చింది. 

రూ.2 లక్షల వరకు రుణ మాఫీ..రూ.10 లక్షలు ప్రమాద బీమా.. 

ఈ స్కీమ్​లో భాగంగా లోన్ తీసుకున్న మహిళలు ఎవరైనా ఏ కారణంతో చనిపోయినా వారు తీసుకున్న లోన్ రూ.2 లక్షల వరకు మాఫీ కానుంది. ప్రస్తుతం గరిష్టంగా ఒక్కో మహిళకు ఇస్తున్న లోన్ రూ.2 లక్షలు మాత్రమే. దీంతో మిగతా సభ్యులు తమ కిస్తీలు చెల్లిస్తే సరిపోతుంది. చనిపోయిన మహిళ బ్యాంకు లింకేజీ రుణం, స్త్రీ నిధి లోన్ రెండూ తీసుకుని ఉంటే మాత్రం ఒక లోన్ మాత్రమే మాఫీ కానుంది. అలాగే  ప్రమాదవశాత్తూ మహిళా గ్రూపు సభ్యురాలు చనిపోతే యాక్సిడెంటల్ బీమా కింద రూ.10 లక్షలు మృతురాలి కుటుంబానికి చెల్లించనున్నారు. 

మహిళలకు బీమాను ఎత్తేసిన బీఆర్ఎస్ సర్కార్ 

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ సర్కార్ హయాంలో డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలంతా అభయ హస్తం స్కీమ్​లో ఉండేవారు. వారికి ఆమ్ ఆద్మీ బీమా యోజన వర్తించేది. ఈ పథకంలో ఉన్న మహిళ లేదా ఆమె భర్త ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.75 వేలు, సహజ మరణమైతే రూ.30 వేల పరిహారం ఇచ్చేవారు. అంత్యక్రియలకు మరో రూ.5 వేలు చెల్లించేవారు. సభ్యుల పిల్లలకు 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు రూ.1,200 స్కాలర్ షిప్ కూడా అందించేవారు.

 కానీ, బీఆర్ఎస్ సర్కార్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ స్కీమ్ రద్దు చేసింది. దీంతో మహిళా సంఘాల సభ్యులు గానీ, వారి భర్తలు గానీ మరణిస్తే పరిహారం అందలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లోన్ బీమాను అమలు చేయడం బాగానే ఉన్నప్పటికీ.. ఆమ్ ఆద్మీ యోజనలోని ప్రయోజనాలను వర్తింపజేస్తే బాగుంటుందని మహిళా సంఘాల సభ్యులు అభిప్రాయపడుతున్నారు.