- లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత
- పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3) తొలగింపు
- 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ పనులు పూర్తి చేసేందుకు ఆమోదం
- 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానలను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయం
- 1500 మెగావాట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్లాంట్కు గ్రీన్సిగ్నల్
- వచ్చే నెల 7న మళ్లీ కేబినెట్ భేటీ.. స్థానికం, రిజర్వేషన్లపై డెసిషన్
- కేబినెట్ నిర్ణయాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం
హైదరాబాద్, వెలుగు:స్థానిక సంస్థల ఎన్నికలపై వచ్చే నెల 3న హైకోర్టులో విచారణ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. హైకోర్టు ఆదేశాల అనంతరం, ఎన్నికల నిర్వహణపై చర్చించేందుకు తిరిగి వచ్చే నెల 7న మరోసారి భేటీ కానున్నది. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించాలని నిర్ణయించింది.
శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనుల పునరుద్ధరణకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ పనులను అంచనా వ్యయం పెంచకుండానే అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో పూర్తి చేయాలని నిర్ణయించింది. 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నది.
విద్యుత్తు అవసరాలు, వచ్చే పదేండ్ల డిమాండ్కు తగ్గట్టుగా భవిష్యత్తు ప్రణాళిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. గురువారం సెక్రటేరియెట్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. దాదాపు 4 గంటలపాటు జరిగిన ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు, సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు వెళ్లాల్సి ఉంటుందని పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
స్థానిక ఎన్నికలపై హైకోర్టులో ఉన్న పిటిషన్ నవంబర్ 3న విచారణకు రానున్నదని, ఆ రోజున హైకోర్టులో వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అందుకే నవంబర్ 7న మరోసారి కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, అదే రోజున రిజర్వేషన్లు, స్థానిక ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని తీర్మానించినట్టు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ నిర్ణయించిందని చెప్పారు.
అందుకు వీలుగా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లో సెక్షన్ 21(3)ని తొలిగించేందుకు ఆమోదం తెలిపిందన్నారు. అసెంబ్లీ ప్రొరోగ్ అయినందున చట్ట సవరణకు గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఆర్డినెన్స్ ప్రతిపాదన ఫైల్ను గవర్నర్కు పంపించాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి
2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలని గడువుగా నిర్ణయించుకున్నట్టు మంత్రి పొంగులేటి వెల్లడించారు. ప్రపంచంలోనే పొడవైన ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పునరుద్ధరించాలని రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం తీసుకుందన్నారు. మిగిలిన పనులను అత్యాధునిక డ్రిల్లింగ్ నైపుణ్యంతో చేపట్టనున్నామని, గ్రావిటీ ద్వారా 3.50 లక్షల ఎకరాలకు నీళ్లను అందించడంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.
ఇప్పటివరకూ సొరంగం తవ్వకానికి వాడిన టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం) కాకుండా.. అధునాతన డ్రిల్లింగ్ పద్ధతులను అనుసరించేందుకు అనుమతించామని, అంచనా వ్యయంలో ఎలాంటి మార్పు లేకుండా మిగిలిన పనులు కూడా పూర్తి చేసేందుకు కాంట్రాక్ట్ ఏజెన్సీ ముందుకు వచ్చిందని చెప్పారు.
అదే కాంట్రాక్ట్ కంపెనీకి సొరంగం తవ్వకం పూర్తి చేసే పనులు అప్పగించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని వివరించారు. మొత్తం 44 కి.మీ. సొరంగంలో రెండు వైపులనుంచి ఇప్పటివరకూ 35 కి.మీ. సొరంగం తవ్వకం పూర్తయిందని చెప్పారు. ఫిబ్రవరి 22న జరిగిన దురదృష్టకర ప్రమాదంతో పనులు ఆగిపోయాయని, మిగిలిన 9 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వడానికి అటవీ, పర్యావరణ, వన్య ప్రాణులకు ఇబ్బంది లేకుండా అత్యాధునిక పరిజ్ఞానాన్ని వాడాలని కేబినెట్ ఆమోదించిందని వెల్లడించారు.
వేగంగా టిమ్స్ నిర్మాణం
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను వేగంగా పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎల్బీ నగర్ టిమ్స్, సనత్ నగర్ టిమ్స్, అల్వాల్ టిమ్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు.
రాష్ట్రంలో 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ యూనిట్ల ఏర్పాటు ప్రతిపాదనలకు రాష్ట్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపిందన్నారు. ఈ నిర్మాణాలను ఎక్కడ చేపట్టాలనే దానిపై తగిన నిర్ణయం తీసుకోవాలని విద్యుత్ శాఖకు సూచించినట్లు చెప్పారు. రామగుండంలో 52 ఏండ్ల క్రితం నాటి రామగుండం థర్మల్ స్టేషన్ (ఆర్టీఎస్బీ 62.5 మెగావాట్ల యూనిట్) కాలపరిమితి ముగిసినందున.. దానిని తొలగించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిపారు.
రాష్ట్రంలో ఇప్పుడున్న విద్యుత్తు అవసరాలు, రాబోయే పదేండ్ల డిమాండ్ అంచనాలకు తగ్గట్టుగా భవిష్యత్తు ప్రణాళిక తయారు చేయాలని విద్యుత్తు శాఖను కేబినెట్ ఆదేశించిందని, అందుకు అవసరమైన విద్యుత్తు ఉత్పత్తికి వ్యూహాలను నివేదించాలని సూచించినట్టు చెప్పారు.
