సిటీలోని ఓయో రూమ్స్ లో కరోనా అనుమానితులు..!

సిటీలోని ఓయో రూమ్స్ లో కరోనా అనుమానితులు..!

హైద‌రాబాద్‌: కరోనా‌ అనుమానితులకు హోటల్ రూములు కేటాయించటంతో స్థానికులు ఆందోళనకు దిగిన సంఘటన‌ కె.పి.హెచ్.బి పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసు స్టేషన్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లో గల ఓయో రూమ్స్ లో సుమారు యాభై మంది కరోనా అనుమానితులకు హోటల్ నిర్వాహ‌కులు రూములు కేటాయించారు. ఈ సంగ‌తి స్థానికులకు తెలియటంతో వారంతా భయబ్రాంతులకు గురై హోటల్ ఎదుట ఆందోళనకి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక కార్పోరేటర్ మందడి శ్రీనివాస్ రావుతో కలిసి హోటల్ యాజమాన్యంతో చర్చలు నిర్వహించారు.

కరోనా భయం స్థానికులలో ఉండటంతో హోటల్ రూంలో ఉన్నవారిని మరో చోటికి తరలించేందుకు హోటల్ యాజమాన్యం హామీ ఇచ్చారని పోలీసులు, కార్పోరేటర్ స్థానికులకు తెలపటంతో వారు ఆందోళన విరమించారు. హోటల్ వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి రూములలో ఉన్న వారు బయటకు రాకుండా అలాగే కొత్త వారు లోనికి వెళ్ళకుండా చర్యలు తీసుకుంటామని సిఐ తెలిపారు.