
హైదరాబాద్ సిటీ, వెలుగు: నాలాల సమస్యని పరిష్కరించడం లేదని యాకుత్పురా ఎంఐఎం ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్పై స్థానికులు తిరగబడ్డారు. మధ్యలో అడ్డువచ్చిన ఎమ్మెల్యే అనుచరులనూ చితకబాదారు. ఇటీవల కురిసిన వర్షాలకు నాలాలు పరిశీలించడానికి మదీనానగర్ దోభిఘాట్కి ఎమ్మెల్యే వెళ్లారు. ఈ క్రమంలోనే స్థానికులకు ఎమ్మెల్యేకు మధ్య వాగ్వాదం జరిగింది. నాలా సమస్య పరిష్కరిస్తానంటూ కాలయాపన చేస్తున్నారని ఎమ్మెల్యే జాఫర్ను నిలదీశారు.
వానాకాలం వచ్చినా నాలా పనులు చేయడం లేదని, తాము ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఇండ్లలోకి నీరు వచ్చాయన్నారు. ఏటా నాలాల పనులు చేస్తామని హామీ ఇచ్చినా చేయడం లేదని ఫైర్ అయ్యారు. దీంతో ఎమ్మెల్యేకు, స్థానికులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఎమ్మెల్యేను కొందరు తోసివేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు జనాలను అడ్డుకునేందుకు ప్రయత్నించగా, వారిని కూడా స్థానికులు చితకబాదారు. గొడవ పెద్దది కావడంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.