
కరోనా ఎంత ప్రమాదకర వైరసో ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకు పెరుగుతున్న కేసులే ఇందుకు నిదర్శనం. ఇది మన ఇండియాలో కూడా చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇప్పటికీ మన దేశంలో 584 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ ను నిర్మూలించేందుకు 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఈ వైరస్ వ్యాప్తి వల్ల ఒకరినొకరు తాకాలంటేనే భయపడుతున్నారు. ఈ వైరస్ వస్తే ఏ ఒక్కరితోనే పోదు. అది వాళ్ల కుటుంబం, వాళ్ల సన్నిహితులను కూడా బలిచేస్తుంది. అందుకే చనిపోతే మృతదేహాలను కూడా చూడనివ్వని పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుంది. ఇవాళ కరీంనగర్ కాశ్మీర్ గడ్డ రైతు బజార్ వద్ద ఇలాంటి పరిస్థితే ఎదురయ్యింది. కూరగాయల కోసం వచ్చిన ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. అయితే కరోనా వైరస్ భయంతో మృతదేహం వద్దకు ఒక్కరు కూడా రాలేదు. దీంతో అక్కడి స్థానికులు అధికారులకు సమాచారం అందించారు.