2004 నుంచి 2014 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలిందని ప్రధాని మోడీ ఆరోపించారు. ఎన్నో భారీ స్కాంలు జరిగాయని విమర్శించారు. ఆ దశాబ్దం అవినీతి దశాబ్దం అని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలిందని చెప్పారు. ఆ దశాబ్ద కాలం దేశంలో రక్తపుటేరులు పారాయని విమర్శించారు. ఆ పదేళ్లు భారత్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఎన్నికల్లో ఓడిపోతే..కేసులు ఓడిపోతే సుప్రీం కోర్టు తీర్పును కూడా తప్పుబట్టేవారన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడిన మోడీ.. రాష్ట్రపతి ప్రసంగం దేశానికి ఆదర్శమని అన్నారు. ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందన్నారు. నిన్న సభలో కొంత మంది సభ్యులు ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారన్నారు. నిన్న ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని రాహుల్ గాంధీని ఉద్దేశించి సెటైర్లు వేశారు. నేతల వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయన్నారు.
ఒకప్పుడు భారత్ తన సమస్యల పరిష్కారానికి ఇతరులపై ఆధారపడేది..కానీ ఇపుడు భారత్ ఇతర సమస్యలను పరిష్కరిస్తుందని రాష్ట్రపతి చెప్పారని మోడీ గుర్తు చేశారు. భారత్ ఈ క్షణం కోసమే ఎంతో కాలం నుంచి ఎదురుచూస్తుందని మోడీ చెప్పారు. దేశంలో అవినీతిని తరిమి కొట్టామని అన్నారు. ఎన్నికలే జీవితం కాదని..140 కోట్ల ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. కొవిడ్ ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని చెప్పారు. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వేదిస్తున్నాయని ఇలాంటి సమయంలోనూ మనం ప్రపంచలోనే ఐదో అతిపెద్ద ఆర్థికశక్తిగా ఎదిగామని అన్నారు. ఇవాళ జీ20 సదస్సును నిర్వహించే స్థాయికి ఎదిగామని ..ఇది కొందరికి కంటగింపు కావొచ్చు కానీ తనకైతే గర్వంగా ఉందని తెలిపారు.
ప్రపంచ దేశాలన్నీ ఈరోజు భారత్ వైపు చూస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. మొబైళ్ల తయారీలో దేశం రెండో స్థానంలో ఉందని... డిజిటల్ ఇండియాను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని చెప్పారు. ఇంధన వినియోగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. కామన్ వెల్త్ క్రీడల్లో మన ఆడపిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. స్టార్టప్ లో మనం మూడో ప్లేసులో ఉన్నామన్నారు. ప్రతి రంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తోందన్నారు. ఇవన్నీ చూసిన కొందరు నిరాశవాదులకు నిద్రపట్టడం లేదని ఎద్దేవా చేశారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఏం చేశామో ప్రజలకు తెలుసని మోడీ అన్నారు.